కరోనా నిబంధనల నెపంతో పోలీసుల దాష్టీకం.. మాస్క్ సరిగా పెట్టుకోలేదని.. ఆటో డ్రైవర్‌పై దాడి.. వైరల్‌గా మారిన దృశ్యాలు

కరోనా నిబంధనలను పాటించని వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని అధికారులకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనిని సాకుగా తీసుకున్న ఇద్దరు పోలీసులు విచక్షణ కోల్పోయి రెచ్చిపోయారు.

కరోనా నిబంధనల నెపంతో పోలీసుల దాష్టీకం.. మాస్క్ సరిగా పెట్టుకోలేదని.. ఆటో డ్రైవర్‌పై దాడి.. వైరల్‌గా మారిన దృశ్యాలు
Police Cruelty On Auto Driver Over Not Wearing Mask

Updated on: Apr 07, 2021 | 7:27 AM

Police cruelty on auto driver: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. ఏడాది కాలంగా జనం ప్రాణాలతో చెలగాటమాడుతోంది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నియంత్రణకు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. ఇదే క్రమంలో కరోనా మహమ్మారిని కంట్రోల్ చేసేందుకు మాస్క్ పెట్టుకోవడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం తప్పనిసరి. ఇందులో భాగంగా ఇటువంటి నిబంధనలను పాటించని వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని అధికారులకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనిని సాకుగా తీసుకున్న ఇద్దరు పోలీసులు విచక్షణ కోల్పోయి ఓ ఆటో డ్రైవర్‌పై తమ ప్రతాపం చూపారు. మాస్క్ సరిగా ధరించలేదని నడిరోడ్డుపై చితకబాదారు.. ఈ ఘటన ఇండోర్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మాస్క్ సరిగా పెట్టుకోని ఒక ఆటో డ్రైవర్‌ను కిందపడేసి అతి దారుణంగా చితకబాదారు. ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే ఆటో డ్రైవర్ కృష్ణ కెయర్(35) అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రిని కలుసుకునేందుకు ఆసుపత్రికి వెళ్తున్నాడు. ఈ సమయంలో అతను మాస్క్ సరిగా పెట్టుకోలేదు. దీనిని గమనించిన ఇద్దరు పోలీసులు ఆ ఆటో డ్రైవర్‌ను ఆపి, పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. అయితే, ఆటో డ్రైవర్ అందుకు నిరాకరించాడు. దీంతో పోలీసులు ఆ ఆటో డ్రైవర్‌పై దాడికి దిగారు. అందరు చూస్తుండగానే ఆ వ్యక్తి కిందపడేసి చావబాదారు.


ఇదంతా గమనించిన అక్కడున్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ వీడియోలో పోలీసులు ఆటో‌డ్రైవర్‌పై దాడికి దిగడం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వీడియో వైరల్ మారడంతో పోలీసుల తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీంతో ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని దర్యాప్తునకు ఆదేశించారు.

Read Also… ఏసీబీ అధికారుల రాకతో తహశీల్దార్ మధ్యవర్తి నిర్వాకం.. కాలిబూడిదైన రూ.5 లక్షలు