దేశంలో మరో ఇంజనీరింగ్ అద్భుతం ప్రారంభానికి సిద్ధమైంది. సముద్రంలో నిర్మించిన వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జి పంబన్ వంతెన త్వరలో అందుబాటులోకి రానుంది. భారీ పడవలు వెళ్లటానికి వంతెనలోని 73 మీటర్ల పొడవు, 660 టన్నుల బరువున్న ఒక భాగం అమాంతం 17 మీటర్ల ఎత్తుకు లేవటం దీని ప్రత్యేకత. తమిళనాడులోని మండపం నుంచి రామేశ్వరం ద్వీపాన్ని కలుపుతూ ఆధునిక హంగులతో దీనిని నిర్మించారు. వంతెన మధ్యలో పడవలకు దారిచ్చేందుకు రోలింగ్ లిఫ్ట్ ఏర్పాటు చేశారు. మధ్య భాగంలో వంతెన స్పాన్లు విడిపోయి ఉంటాయి. సిబ్బంది వాటికి ఏర్పాటు చేసిన చట్రంలో ఇనుప కమ్మీలతో తిప్పగానే ఆ రెండు భాగాలు రోడ్డు లెవల్ క్రాసింగ్ రైలు గేటు తరహాలు పైకి లేస్తాయి. దీంతో పడవలు ముందుకు సాగుతాయి. ఆ తర్వాత మళ్లీ మూసి విడిపోయిన రైలు పట్టాలు కలిసిపోయేలా చేస్తారు.
111 సంవత్సరాల క్రితం ఇక్కడ నిర్మించిన పాత వంతెన కాలం తీరిపోవటంతో దాని పక్కనే ఈ కొత్త వంతెనను నిర్మించారు. పాత బ్రిడ్జిపై రైళ్లు 50 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగం ప్రయాణించేందుకు వీలయ్యేది కాదు. కానీ కొత్త బ్రిడ్జిని అధికవేగంతో రైళ్లు ప్రయాణించేందుకు అనువుగా నిర్మించారు. వంతెనపై ట్రయల్స్ను విజయవంతంగా నిర్వహించారు దక్షిణ మధ్య రైల్వే అధికారులు. త్వరలోనే ఈ వంతేనను ప్రధాని మోదీ ప్రారంభించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ తెలిపారు.