ISRO: టెన్షన్‌ వద్దు.. 10 శాటిలైట్లు 24 బై 7 దేశాన్ని పహారా కాస్తున్నాయి: ఇస్రో

ఇస్రో చైర్మన్ వి. నారాయణన్, పాకిస్థాన్‌తో ఉన్న ఉద్రిక్తతల నేపథ్యంలో, భారతదేశ సరిహద్దులను, తీర ప్రాంతాలను 24/7 పర్యవేక్షించడానికి 10 ఉపగ్రహాలు నిరంతరం పనిచేస్తున్నాయని ప్రకటించారు. ఈ ఉపగ్రహాలు కీలకమైన నిఘా డేటాను అందించి, జాతీయ భద్రతను బలోపేతం చేస్తున్నాయి. ఉపగ్రహాలు, డ్రోన్ టెక్నాలజీ దేశ రక్షణకు అత్యవసరమని వివరించారు.

ISRO: టెన్షన్‌ వద్దు.. 10 శాటిలైట్లు 24 బై 7 దేశాన్ని పహారా కాస్తున్నాయి: ఇస్రో
Isro

Updated on: May 12, 2025 | 10:42 AM

పాకిస్థాన్‌తో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో దేశ సరిహద్దులు తీరప్రాంతాన్ని పర్యవేక్షించడానికి, రక్షించడానికి 10 భారతీయ ఉపగ్రహాలు 24 గంటలు నిర్విరామంగా పనిచేస్తున్నాయని ఇస్రో చైర్మన్ వి.నారాయణన్ అన్నారు. కీలకమైన నిఘా డేటాను అందించడం ద్వారా పౌరులను రక్షించడంలో ఈ ఉపగ్రహాలు వ్యూహాత్మక పాత్ర పోషిస్తాయని తెలిపారు. మణిపూర్‌లోని ఇంఫాల్‌లో జరిగిన సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ (CAU) 5వ స్నాతకోత్సవంలో ఇస్రో చైర్మన్ మాట్లాడుతూ.. భారతదేశపు 7,000 కిలో మీటర్ల సముద్ర తీరం, ఉత్తర భూభాగాలపై నిరంతరం నిఘా ఉంచాల్సిన అవసరం గురించి ఆయన వివరించారు.

“మన దేశ భద్రతను నిర్ధారించుకోవాలంటే, మన ఉపగ్రహాల ద్వారా సేవలందించాలి. మన సముద్ర తీర ప్రాంతాలను మనం పర్యవేక్షించాలి. మనం మొత్తం ఉత్తర భాగాన్ని నిరంతరం పర్యవేక్షించాలి” అని నారాయణన్ అన్నారు. శాటిలైట్లు, డ్రోన్ టెక్నాలజీ లేకుండా భారతదేశం పూర్తి భద్రతా కవరేజీని సాధించలేమని నారాయణన్ స్పష్టం చేశారు. ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ముఖ్యంగా “పొరుగువారు” ముప్పును కలిగిస్తున్నందున, రక్షణ సంసిద్ధతకు అంతరిక్ష ఆధారిత నిఘా చాలా కీలకంగా మారింది. జాతీయ భద్రతపై ఇస్రో తీసుకుంటున్న చర్యలను, పోషిస్తున్న కీలక పాత్రను ఆయన వివరించారు.

కాగా.. భారత్‌, పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇస్రో ఉపగ్రహ నిఘా మరింత కీలకంగా మారుతోంది. సరిహద్దు ఘర్షణల ముప్పు, రియల్-టైమ్ ఇంటెలిజెన్స్ అవసరం దృష్ట్యా, అంతరిక్ష ఆధారిత పర్యవేక్షణ భారతదేశానికి వ్యూహాత్మక ప్రయోజనాన్ని అందిస్తుంది. ఈ ఉపగ్రహాలు అందించే నిరంతర నిఘా, సరిహద్దుల వెంబడి, సముద్రంలో ఏవైనా శత్రు కార్యకలాపాల పట్ల సాయుధ దళాలు అప్రమత్తంగా ఉండటానికి సహాయపడుతుంది. భౌగోళిక రాజకీయ సవాళ్లు కొనసాగుతున్నందున, ఉపగ్రహం, డ్రోన్ సాంకేతికతలో భారతదేశం పెట్టుబడి పెట్టడం దేశ రక్షణను బలోపేతం చేయడమే కాకుండా, ప్రత్యర్థులకు సంసిద్ధత, సాంకేతిక సామర్థ్యం గురించి స్పష్టమైన సందేశాన్ని కూడా పంపుతుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us