
ఇండియన్ కోస్టర్ కారిడార్లో ఇరాన్ షిప్లు కలకలం రేపుతున్నాయి. కొద్దిరోజుల క్రితం మూడు ఆయిల్ ట్యాంకర్లతో కూడిన షిప్లను సీజ్ చేసిన ఘటన మరువక ముందే.. ఇప్పుడు గుజరాత్ తీరంలోని అరేబియా మహాసముద్రంలో అక్రమంగా ప్రవేశించిన ఇరాన్ షిప్ను సీజ్ చేయడంతోపాటు నలుగురు ఇరాన్ దేశస్థులను ఇండియన్ నేవీ అదుపులోకి తీసుకోవడం హాట్టాపిక్గా మారింది. ఇక.. గుజరాత్ తీరంలోని..అరేబియా మహాసముద్రంలో ద్వారక కోస్ట్ దగ్గర నేవీ అధికారులు భద్రతా తనిఖీలు నిర్వహిస్తూ.. అనుమానాస్పదంగా ఒక నౌక వెళ్లడం గమనించారు. దీంతో.. వెంటనే ఆ షిప్ను చుట్టుముట్టి సోదాలు చేశారు. పెద్దఎత్తున విదేశీ సిగరెట్ల ప్యాకెట్లు బయటపడడంతో నేవీ అధికారులు షాకయ్యారు. దాదాపు 200 కాటన్ల వరకూ సిగరెట్ల కాటన్స్ సీజ్ చేయగా.. వీటిలో లక్ష వరకూ సిగరెట్ ప్యాకెట్స్ ఉన్నట్లు తెలిపారు. భారత మార్కెట్లో వీటి విలువ సుమారు 5 కోట్ల రూపాయలు వరకు ఉండొచ్చని అంచనా వేశారు. అటు.. నలుగురు ఇరాన్ దేశస్థులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అంతర్జాతీయ ఆంక్షలను ధిక్కరిస్తూ.. తప్పుడు పత్రాలతో సరుకు రవాణా చేస్తున్న ఈ నౌకల వెనుక భారీ కుట్ర దాగి ఉన్నట్లు ఇప్పటికే నేవీ అధికారులు గుర్తించారు. అయితే.. వరుసగా పట్టుబడుతున్న ఈ నౌకలు.. భారత సముద్ర తీరంలోకి ఎంటర్ అయ్యే ముందు.. పాకిస్థాన్ సముద్ర జలాల్లో గడపడం అనుమానాలకు తావిస్తోంది. అంతేకాదు.. పాక్ తీరంలో సిగ్నల్స్ నిలిపివేసిన తీరుపై ఇండియన్ నేవీ అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టారు.