
అమెరికా, ఇరాన్ల మధ్య కుదిరిన శాంతి ఒప్పందాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాగతించారు. ఈ ఒప్పందం పశ్చిమ ఆసియా ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతలకు ముగింపు పలికి, శాంతి, స్థిరత్వాన్ని పునరుద్ధరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే అంతర్జాతీయ వాణిజ్యం, నౌకాయాన రాకపోకలకు ఈ ఒప్పందం ఊతమిస్తుందని పేర్కొన్నారు.
ప్రధాని మోదీ సోమవారం (జూన్ 15) సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో స్పందిస్తూ, అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన ఒప్పందాన్ని హర్షిస్తున్నట్లు తెలిపారు. పశ్చిమ ఆసియాలో కొనసాగిన ఘర్షణలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆర్థిక ప్రభావాన్ని చూపాయని ఆయన అన్నారు. ఈ ఉద్రిక్తతల కారణంగా అనేక దేశాల్లో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించడమే కాకుండా అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలు, వాణిజ్య కార్యకలాపాలు కూడా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు.
ఈ ఒప్పందం విజయవంతంగా అమలైతే ప్రాంతీయ స్థాయిలో శాంతి వాతావరణం నెలకొంటుందని, సముద్ర మార్గాల్లో నౌకాయాన స్వేచ్ఛ పునరుద్ధరించబడుతుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన ఈ ప్రాంతంలో స్థిరత్వం రావడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లకు కూడా ప్రయోజనం చేకూరుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అదేవిధంగా, ప్రస్తుతం మిగిలి ఉన్న వివాదాస్పద అంశాలపై కూడా ఇరు దేశాలు చర్చల ద్వారానే పరిష్కారం కనుగొంటాయని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. సంభాషణ, దౌత్య మార్గాల ద్వారానే శాశ్వత శాంతి సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
I welcome the understanding reached between the United States and Iran on ending the conflict in West Asia, which has caused serious economic disruption across the world and led to loss of life in many countries.
India hopes that the implementation of this understanding will…
— Narendra Modi (@narendramodi) June 15, 2026
పశ్చిమ ఆసియాలో శాంతి నెలకొనడం భారతదేశానికి కూడా కీలకమే. ఎందుకంటే ఆ ప్రాంతంతో భారత్కు ఇంధన, వాణిజ్య, వ్యూహాత్మక సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా-ఇరాన్ ఒప్పందాన్ని భారత్ సానుకూల పరిణామంగా చూస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..