
భారత్-పాక్ మధ్య కొనసాగిన వార్ ప్రస్తుతం విరమించిన విషయం తెలిసిందే. జమ్మూకశ్మీర్లో అమాయక ప్రజలను కాల్చి చంపిన ఉగ్రవాదులపై భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్పై తన ప్రతాపం చూపించింది భారత్. ఈ యుద్ధం నేపథ్యంలో జమ్మూకశ్మీర్లోని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. అయితే ప్రస్తుతం భారత్ -పాక్ మధ్య ఉద్రిత్తకతలు చల్లారాయి. ఈ నేపథ్యంలో జమ్మూకశ్మీర్, శ్రీనగర్లలో విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలతో ఈ నెల 7వ తేదీ నుంచి విద్యాసంస్థలు మూతపడ్డాయి. పరిస్థితులు సద్దుమణగడంతో పాఠశాలలు, కళాశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి.
అలాగే రెండు దేశాల మధ్య యుద్ధం నెలకొనడంతో జమ్మూ కాశ్మీర్ సరిహద్దు జిల్లాలైన కథువా, జమ్మూ, రాజౌరి, పూంచ్, సాంబా, ఉధంపూర్లలో మంగళవారం కూడా విద్యాసంస్థలు మూసి ఉండనునున్నాయి. మంగళవారం సాయంత్రం పరిస్థితిని సమీక్షించిన తర్వాత ఈ జిల్లాల్లో విద్యా సంస్థలను ప్రారంభించే నిర్ణయం తీసుకోనున్నారు అధికారులు.
రాష్ట్రంలోని సరిహద్దుయేతర జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యాసంస్థలు మంగళవారం తెరుచుకుంటాయి. పరిస్థితిని సమీక్షించిన తర్వాత జమ్మూ డివిజన్లోని దోడా, కిష్త్వార్, రియాసి, రాంబన్ జిల్లాల్లో మంగళవారం నుండి ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలు తెరవాలని నిర్ణయించినట్లు డివిజనల్ కమిషనర్ తెలిపారు.
ఇదిలా ఉండగా, సోమవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీ జాతినుద్దేశించి ప్రసంగించిన తర్వాత, పాకిస్తాన్ సైన్యం మరోసారి కాల్పుల విరమణను ఉల్లంఘించి జమ్మూలోని సాంబా, పర్గల్, గర్ఖల్ సెక్టార్లలో డ్రోన్ దాడికి ప్రయత్నించింది. భారత సైన్యం త్వరితగతిన చర్య తీసుకుని శత్రువు దాడిని తిప్పికొట్టింది. ఈ దాడిలో ఎటువంటి ప్రాణ నష్టం జరగనప్పటికీ, మూడు ఇళ్లు దెబ్బతిన్నాయని, ఒక వృద్ధ మహిళ గుండెపోటుకు గురైనట్లు సమాచారం. శ్రీ మాతా వైష్ణో దేవి మార్గంలో, సరిహద్దు ప్రాంతాలలో ముందుజాగ్రత్త చర్యగా బ్లాక్అవుట్ కూడా విధించారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి