IT Raid: గుర్తింపు లేని రాజకీయ పార్టీలే టార్గెట్‌గా దాడులు.. విరాళాల సేకరణపై ఐటీ ఫోకస్..

గుర్తింపు లేని పార్టీలే టార్గెట్‌..ఆయా పార్టీల విరాళాల సేకరణపై ఐటీ ఫోకస్‌. 12కు పైగా రాష్ట్రాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు ఐటీ అధికారులు. రాజకీయ పార్టీల ముసుగులో బ్లాక్‌మనీని వైట్‌గా మార్చుతున్నట్లుగా వచ్చిన ఫిర్యాదులతో పాటు..ఈసీ సిఫార్సుతో ఈ దాడులు చేశారు.

IT Raid: గుర్తింపు లేని రాజకీయ పార్టీలే టార్గెట్‌గా దాడులు.. విరాళాల సేకరణపై ఐటీ ఫోకస్..
It Raids

Updated on: Sep 07, 2022 | 8:38 PM

గుర్తింపు లేని రాజకీయ పార్టీల అక్రమ వసూళ్లపై ఐటీ శాఖ మెరుపు దాడులు చేసింది. ఈసీ లిస్ట్‌లో ఉండి, గుర్తింపు పొందని రాజకీయ పార్టీలే టార్గెట్‌గా ఈ దాడులు నిర్వహించారు ఐటీ అధికారులు. 12కు పైగా రాష్ట్రాల్లోని పలు నగరాల్లో సోదాలు నిర్వహించారు. కొన్ని పార్టీలు నిబంధనలు పాటించకుండా విరాళాలు స్వీకరించి ఆర్థికపరమైన అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఢిల్లీ, గుజరాత్‌, చత్తీస్‌ఘడ్‌, హర్యానా సహా పలు రాష్ట్రాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.

బోగస్ విరాళాలు, పన్నుల్లో మోసాలకు పాల్పడ్డారనే కారణాలతో 87 రాజకీయ పార్టీలను జాబితా నుంచి తొలగించింది ఈసీ. బోగస్ క్లెయిమ్‌లు చేశారనే సమాచారంతో అనుమానమున్న చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. కేవలం ఐటీ మినహాయంపు, ఎన్నికల సమయాల్లో సదుపాయాల కోసమే పార్టీలు రిజిస్ట్రేషన్ చేసుకుని ఆర్ధిక అవకతవకలకు పాల్పడుతున్నట్లు దుమారం చెలరేగడంతో సోదాలు చేపట్టారు. తొలుత 7 రాష్ట్రాల్లో మొదలైన సోదాలు.. 12 రాష్ట్రాలకు పెరిగింది. ఈ సోదాల్లో కొన్ని పార్టీలు వందల కోట్ల విరాళాలు సేకరించినట్టు గుర్తించారు. ఇక దేశ వ్యాప్తంగా మరిన్ని రాష్ట్రాల్లో కూడా సోదాలు జరిగే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరోవైపు గుర్తింపు లేని రాజకీయ పార్టీలకు నిధులు సమకూరుస్తున్నారన్న ఆరోపణలతో ఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ పైనా ఐటీ శాఖ దాడులు చేసింది. ఢిల్లీలోని లేడీ శ్రీరామ్‌ కళాశాల ప్రిన్సిపల్‌గా పనిచేసిన రాజకీయ శాస్త్రవేత్త మీనాక్షీ గోపీనాథ్‌ ప్రస్తుతం సీపీఆర్‌ పాలకమండలికి అధ్యక్షత వహిస్తున్నారు.

ఇదిలా ఉంటే బెంగాల్‌ న్యాయశాఖ మంత్రి మొలోయ్‌ ఘటక్‌ ఇళ్లపై సీబీఐ సోదాలు చేసింది. కోల్‌కతాలోని నాలుగు ప్రాంతాల్లో, అసన్‌సోల్‌లోని ఆయన ఇంట్లో ఏకకాలంలో అధికారులు సోదాలు నిర్వహించారు. బొగ్గు కుంభకోణంలో మొలోయ్‌పై ఆరోపణలతో ఐదు ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఆయనను ఈడీ ప్రశ్నించింది. కాగా, రాష్ట్రంలో బొగ్గు స్మగ్లింగ్‌పై పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్‌ బెనర్జీని, ఆయన సతీమణి ఉజిరా నరులా బెనర్జీ, ఆమె బంధువులను కూడా ఈడీ విచారించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం

Follow Us