హిమగిరుల్లో పేకమేడల్లా కూలుతున్న భవనాలు.. భారీ వర్షాలతో 24 గంటల్లో 55 మంది మృతి

Himachal Pradesh Rains: హిమగిరుల్లో వరదల విలయం కొనసాగుతోంది. హిమాచల్‌ ప్రదేశ్‌లో భారీవర్షాలతో జనం తల్లడిల్లుతున్నారు. వర్ష బీభత్సం కారణంగా 24 గంటల్లోనే 55 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరిత పెరిగే అవకాశముందని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. హిమాచల్‌లో కొండచరియలు విరిగిపడి వేల సంఖ్యలో ఇళ్లు ధ్వంసమయ్యాయి.

హిమగిరుల్లో పేకమేడల్లా కూలుతున్న భవనాలు.. భారీ వర్షాలతో 24 గంటల్లో 55 మంది మృతి
Himachal Pradesh Rains

Updated on: Aug 15, 2023 | 8:36 PM

Himachal Pradesh Rains: హిమగిరుల్లో వరదల విలయం కొనసాగుతోంది. హిమాచల్‌ ప్రదేశ్‌లో భారీవర్షాలతో జనం తల్లడిల్లుతున్నారు. వర్ష బీభత్సం కారణంగా 24 గంటల్లోనే 55 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరిత పెరిగే అవకాశముందని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. హిమాచల్‌లో కొండచరియలు విరిగిపడి వేల సంఖ్యలో ఇళ్లు ధ్వంసమయ్యాయి. 621 రహదారుల్లో రాకపోకలు స్తంభించాయి. వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా 12 జిల్లాలకు గురువారం వరకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. సిమ్లాలో శివాలయం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 12కి చేరుకుంది. శిథిలాల కింద ఇంకా కొంతమంది చిక్కుకున్నట్టు అనుమానిస్తున్నారు. సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందితో పాటు ఎస్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. దైవదర్శనం కోసం వచ్చిన భక్తుల పైకి కొండచరియలు విరిగిపడడంతో ప్రమాదం జరిగింది. శివాలయం కూడా ధ్వంసమయ్యింది. ఈ ప్రాంతంలో మొత్తం 20 మందికి పైగా చిక్కుకున్నట్లు పేర్కొంటున్నారు.

మండిలో బియాస్‌ నది ఉగ్రరూపం

మండిలో బియాస్‌ నది ఉగ్రరూపం కొనసాగుతోంది. 12 జిల్లాల్లో 857 రహదారులు మూతపడడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిమ్లాలోని ఫాగ్లీ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి ఐదుగురు చనిపోయారు. 17 మందిని సహాయక సిబ్బంది రక్షించారు. మండీ జిల్లాలో 19 మంది చనిపోయారు. సోలన్‌ జిల్లా కూడా వర్షాలతో తీవ్రంగా ప్రభావితమైంది. జడోన్‌ గ్రామంలో ఆకస్మిక వరదలో కొట్టుకుపోయి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.

ఇవి కూడా చదవండి

ప్రపంచ వారసత్వ నిర్మాణాల్లో ఒకటైన..

యునెస్కో గుర్తించిన ప్రపంచ వారసత్వ నిర్మాణాల్లో ఒకటైన షిమ్లా-కల్కా రైల్వే లైన్‌ వరద నీటికి దెబ్బతింది. దీంతో 50 మీటర్ల మేర రైలు పట్టాలు గాలిలోనే వేలాడుతున్నాయి. భారీవర్షాల కారణంగా మండి జిల్లాలో ఎక్కువగా నష్టం జరిగింది. మండిలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. కల్కా రైల్వే లైన్‌ను పునరుద్దరించడానికి యుద్దప్రాతిపదికన చర్యలు చేపట్టారు అధికారులు. భారీ వర్షాల కారణంగా సిమ్లాలో స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు సీదాసాదాగా నిర్వహించారు. వరదల పరిస్థితిపై హోంమంత్రి అమిత్‌షా తనతో మాట్లాడారని తెలిపారు సీఎం సుఖ్విందర్‌ సుక్కు. జేపీ నడ్డా, ఖర్గే, రాహుల్‌గాంధీ హిమాచల్‌ప్రదేశ్‌ ప్రజలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారని తెలిపారు. అధికారులు, నేతలు వరదప్రభావిత ప్రాంతాల్లో ఉండి సహాయక చర్యలు పర్యవేక్షించాలని.. వరదబాధితులకు అండగా ఉండాలని ఆదేశించినట్లు వెల్లడించారు.

ఉత్తరాఖండ్‌లో కూడా వరదల బీభత్సం

ఉత్తరాఖండ్‌లో కూడా వరదల బీభత్సం కొనసాగుతోంది. డెహ్రాడూన్‌,రిషికేశ్‌లో గంగానది ప్రమాదస్థాయిని దాటి ప్రవహిస్తోంది. భారీ వర్షాలకు రాష్ట్రంలో ఆరుగురు చనిపోయారు. జోషిమఠ్‌లో ఇళ్లకు మళ్లీ పగుళ్లు రావడంతో స్థానికులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. పలుచోట్ల జాతీయ రహదారులు ధ్వంసం కావడంతో ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్, కేదార్‌నాథ్, గంగోత్రికి రాకపోకలు నిలిచిపోయాయి. చార్‌దామ్‌ యాత్రను రెండు రోజుల పాటు రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఫలితంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాహనాలు కొట్టుకుపోయాయి. రుద్రప్రయాగ్, దేవప్రయాగ్, రిషికేశ్‌లో అలకనంద, మందాకినీ, గంగా నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. రిషికేశ్‌లో 435 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..