
జమ్ముకశ్మీర్ మంచుమయం అయ్యింది. ఎటువైపు చూసినా కనుచూపు మేరలో హిమపాతం దర్శనమిస్తోంది. మంచు దుప్పటి కప్పుకున్న కాశ్మీర్ అందాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. గుల్మార్గ్, సోనామార్గ్, దూద్పత్రి సహా దక్షిణ, ఉత్తరకశ్మీర్లోని ఎత్తయిన ప్రాంతాలలో భారీగా మంచు కురుస్తుండటంతో ఆ ప్రాంతాలు శ్వేతవర్ణంలోకి మారిపోయాయి. సోనామార్గ్ పరిసరాలన్నీ అందంగా, ఆహ్లాదకరంగా, అద్భుతంగా కనిపిస్తున్నాయి. ఆ సుందర దృశ్యాలను టూరిస్టులకు కనువిందు చేస్తున్నాయి. ఇక కశ్మీర్ వ్యాలీలో కొన్నిరోజుల నుంచి మంచు విపరీతంగా కురుస్తోంది. సన్నని దూది పింజాల్లా రాలుతున్న మంచును యాత్రికులు ఎంజాయ్ చేస్తున్నారు. మరోవైపు భారీ మంచుతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా.. రైల్వే ట్రాకులపై భారీగా మంచు పేరుకుపోవడంతో పలు ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీ దెబ్బతింది. స్నో కట్టర్ అమర్చిన లోకోమోటివ్ ద్వారా ట్రాక్ క్లియరెన్స్ పనులు కొనసాగిస్తున్నారు అధికారులు. ఇక శ్రీనగర్-లడఖ్ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. రాబోయే రోజుల్లో మంచు తీవ్రత పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు అలర్ట్ అయ్యారు. రోడ్డు క్లియరెన్స్, నిరంతర విద్యుత్, తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించారు.