రక్షా బంధన్ వేళ కల్తీ మిఠాయిల కలకలం.. ఏకంగా 10 క్వింటాళ్ల రసగుల్లాలు సీజ్!

రక్షా బంధన్ ముందు ఘజియాబాద్‌లో 10 క్వింటాళ్ల కల్తీ రసగుల్లాలు సీజ్ అయ్యాయి. పనీర్, చక్కెరతో పాటు రసాయనాలతో తయారైన ఈ మిఠాయిలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకుడి లైసెన్స్ రద్దు చేయడంతో పాటు, పరీక్షలకు నమూనాలను పంపారు. పండుగల వేళ కల్తీ ఆహారానికి అడ్డుకట్ట వేయడానికి దేశవ్యాప్తంగా ఆహార భద్రత తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.

రక్షా బంధన్ వేళ కల్తీ మిఠాయిల కలకలం.. ఏకంగా 10 క్వింటాళ్ల రసగుల్లాలు సీజ్!
Adulterated Rasgullas Seized

Updated on: Aug 25, 2026 | 1:04 PM

రక్షా బంధన్ పండుగకు ముందు దేశవ్యాప్తంగా కల్తీ ఆహార పదార్థాలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఆహార భద్రతా శాఖ అధికారులు భారీగా కల్తీ రసగుల్లాలను స్వాధీనం చేసుకున్నారు. విజయ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిహారీపురాలో ఓ గిడ్డంగిపై దాడులు నిర్వహించిన అధికారులు దాదాపు 10 క్వింటాళ్లు అంటే 1,000 కిలోల తయారైన ఛేనా రసగుల్లాలను సీజ్ చేశారు.

కల్తీ మిఠాయిల తయారీ, నిల్వ జరుగుతోందన్న పక్కా సమాచారంతో అధికారులు ఈ దాడులు చేపట్టారు. స్వాధీనం చేసుకున్న రసగుల్లాల తయారీలో కల్తీ పనీర్, చక్కెరతో పాటు ‘సెఫోలైట్’ వంటి రసాయనాలను ఉపయోగించినట్లు అధికారులు గుర్తించారు. ప్రాంగణం నుంచి నాలుగు నమూనాలను సేకరించి పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపారు. మరోవైపు సీజ్ చేసిన మిఠాయిలను నిబంధనల ప్రకారం పారవేసే ప్రక్రియను అధికారులు చేపట్టారు. నిర్వాహకుడి లైసెన్సును రద్దు చేసిన అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

ఇదిలా ఉండగా, ఆగస్టు 14న ఘజియాబాద్‌లోని పలు డెయిరీ కేంద్రాలపై నిర్వహించిన తనిఖీల్లో 868 కిలోల పనీర్, 170 కిలోల కోవాను అధికారులు ధ్వంసం చేశారు. కల్తీ ఆహారానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చర్యలు కొనసాగుతున్నాయని FSSAI వెల్లడించింది.

మరోవైపు ఉత్తరాఖండ్‌లోనూ పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని తనిఖీలు ముమ్మరమయ్యాయి. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆదేశాలతో వారం రోజుల పాటు అన్ని జిల్లాల్లో తనిఖీలు చేపట్టారు. చమోలీ, రుద్రప్రయాగ్, అల్మోరా, బాగేశ్వర్, పిథోరగఢ్, చంపావత్, డెహ్రాడూన్, హరిద్వార్, పౌరీ, నైనిటాల్, తెహ్రీ, ఉత్తరకాశీ జిల్లాల్లో ఆహార సంస్థలను తనిఖీ చేసి పెద్ద సంఖ్యలో నమూనాలు సేకరించారు.

పాడైపోయిన, గడువు ముగిసిన ఆహార పదార్థాలను పలు ప్రాంతాల్లో ధ్వంసం చేయడంతో పాటు, నిబంధనలు పాటించని వ్యాపారులకు నోటీసులు జారీ చేశారు. లైసెన్స్ లేకుండా ఆహార పదార్థాలు విక్రయిస్తున్న వారిపైనా చర్యలు చేపట్టారు. పండుగ వేళ మిఠాయిలు, పాల ఉత్పత్తులకు డిమాండ్ పెరిగే నేపథ్యంలో కల్తీని అరికట్టేందుకు తనిఖీలు మరింత కఠినతరం చేయాలని అధికారులు నిర్ణయించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us