
మధ్యప్రదేశ్లోని షియోపూర్ జిల్లాలో పుచ్చకాయ తిని ఒకే కుటుంబానికి చెందిన తండ్రి మరణించగా, కుమారుడి పరిస్థితి విషమంగా మారిన హృదయవిదారక ఘటన వెలుగుచూసింది. స్థానిక నివేదికల ప్రకారం, సదరు కుటుంబ సభ్యులు మార్కెట్ నుండి ఒక పుచ్చకాయను కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకున్నారు. తండ్రి, కొడుకు ఇద్దరూ కలిసి ఆ పండును తిన్నారు. అయితే, తిన్న కొద్దిసేపటికే ఇద్దరి ఆరోగ్యం క్షీణించింది. తీవ్రమైన కడుపునొప్పి, ఎడతెరిపి లేని వాంతులు, విరేచనాలతో వారు అస్వస్థతకు గురయ్యారు. పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో కుటుంబ సభ్యులు వారిని వెంటనే సమీపంలోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి తండ్రి కన్నుమూశారు. ప్రస్తుతం కుమారుడు ఆసుపత్రిలో అత్యవసర విభాగంలో (ICU) ప్రాణాలతో పోరాడుతున్నాడు.
ఈ ఘటనపై వైద్యులు స్పందిస్తూ, ఇది తీవ్రమైన ఫుడ్ పాయిజనింగ్ కేసుగా పేర్కొన్నారు. వేసవిలో పుచ్చకాయలను త్వరగా పండించడానికి లేదా అవి ఎర్రగా కనిపించడానికి ఆక్సిటోసిన్ వంటి ప్రమాదకరమైన రసాయన ఇంజక్షన్లు ఇస్తుంటారు. లేదా పండ్లను కోసి ఎక్కువసేపు బయట ఉంచినప్పుడు వాటిపై హానికరమైన బ్యాక్టీరియా చేరుతుంది. వీటిని తినడం వల్లే ఇలాంటి ప్రాణాంతక పరిస్థితులు ఏర్పడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కట్ చేసిన పండ్లను కొనకండి: మార్కెట్లో చాలా సేపటి క్రితం కోసి ఉంచిన పుచ్చకాయ ముక్కలను అస్సలు కొనకూడదు. ఎల్లప్పుడూ పూర్తిగా ఉన్న పండునే కొనుగోలు చేయాలి.
బాగా కడగాలి: పుచ్చకాయను కోసే ముందు దానిపై ఉన్న కెమికల్స్, మట్టి పోయేలా మంచి నీటితో శుభ్రంగా కడగాలి.
కెమికల్ పండ్లను గుర్తించండి: పండు లోపల భాగం విపరీతమైన ముదురు ఎరుపు రంగులో ఉండి, గింజలు మాత్రం తెల్లగా ఉంటే, దానికి ఇంజక్షన్ ఇచ్చారని అర్థం. అలాంటి వాటిని తినకండి.
ఎక్కువసేపు నిల్వ ఉంచొద్దు: పుచ్చకాయను కోసిన వెంటనే తినేయాలి. ఫ్రిజ్లో కూడా ఎక్కువ రోజులు కట్ చేసిన పుచ్చకాయను ఉంచి తినడం ఆరోగ్యానికి హానికరం.
ఈ ఘటన వేసవిలో మనం తినే ఆహారం, పండ్ల విషయంలో ఎంత అప్రమత్తంగా ఉండాలో గుర్తు చేస్తోంది. ఏదైనా పండు తిన్న తర్వాత అసౌకర్యంగా అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..