Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లో ఒక్కసారిగా భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం..

జమ్మూకశ్మీర్‌లో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై ఇది 4.8గా నమోదవ్వగా.. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరక్కపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. శ్రీనగర్ సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు చెబుతుండగా.. అటు పాకిస్తాన్‌లోని పలు ప్రాంతాల్లో కూడా భూమి కంపించినట్లు తెలుస్తోంది.

Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లో ఒక్కసారిగా భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం..
Earthquake

Updated on: Feb 02, 2026 | 8:41 AM

జమ్మూకాశ్మీర్‌లో ఒక్కసారిగా భూప్రకంపనలు చెలరేగాయి. సోమవారం ఉదయం ఐదున్నర గంటల సమయంలో భూకంపం సంభవించింది.  భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.8గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. శ్రీనగర్‌ సమీపంలోని బుడ్గామ్ జిల్లాలో ఈ భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించారు. శ్రీనగర్‌, పుల్వామా, షోపియాన్‌, బారాముల్లా ప్రాంతాల్లో భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మళ్ళీ ప్రకంపనలు వస్తాయేమో అనే భయంతో ప్రజలు రోడ్ల మీదనే ఉండిపోయారు. నేషనల్ సెంటర్ ఆఫ్ సీస్మోలజీ ప్రకారం.. భూకంపం 10 కిలోమీటర్ల లోతులో చెలరేగిన్లు వెల్లడైంది. పట్టన్ ప్రాంతంలో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. అటు పాకిస్తాన్‌లోని పలు ప్రాంతాల్లో కూడా భూమి స్వల్పంగా కంపించినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

NCS వివరాల ప్రకారం.. భూకంప కేంద్ర ప్రాంతం గుల్మార్గ్‌కు దగ్గరగా, శ్రీనగర్‌కు పశ్చిమాన రిఫరెన్స్ పాయింట్లను ఉపయోగిస్తోంది.ఈ ప్రదేశం పహల్గామ్‌కు పశ్చిమాన 84 కి.మీ దూరంలో, కార్గిల్‌కు పశ్చిమ-నైరుతి దిశలో దాదాపు 164 కిలోమీటర్ల దూరంలో ఉందని అధికారులు చెబుతున్నారు.  ఈ భూకంపం వల్ల ఎలాంటి నష్టం జరిగినట్లు ఇప్పటివరకు అధికారులు గుర్తించలేదు. కానీ సోషల్ మీడియాలో భూకంపంకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. భూప్రకంపనల సమయంలో CCTV కెమెరాలలో రికార్డయిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అటు సోమవారం తెల్లవారుజామున 3.30 గంటలకు అండమాన్, నికోబార్ దీవులలో 4.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ తర్వాత ఐదున్నర గంటలకు జమ్మూకశ్మీర్‌లో భూమి కంపించింది. గంటల వ్యవధిలోనే రెండు ప్రాంతాల్లో భూప్రకంపనలు చెలరేగడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.