జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఎంపిక కోసం నిర్వహించే యూజీసీ-నెట్ ప్రశ్నపత్రం డార్క్నెట్లో లీకైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మంగళవారం జరిగిన ఆ పరీక్షను ఎన్టీఏ రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ క్రమంలోనే తాజాగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అక్రమాలు లేదా మాల్ప్రాక్టీస్లు లేని పరీక్షను నిర్వహించడంలో కేంద్రం నిబద్దతతో ఉందని ఆయన అన్నారు. నీట్-యూజీ ఫలితాలు, యూజీసి-ఎన్ఈటీ పరీక్షల రద్దుపై ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. పరీక్షలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేలా ప్రభుత్వం ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.
‘పారదర్శకంగా, అవకతవకలు, మాల్ ప్రాక్టీస్లు లేని పరీక్షలను నిర్వహించడంలో కేంద్రం నిబద్దతతో ఉంది. నిపుణుల ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయడం అనేది పరీక్షా ప్రక్రియ, సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, సాధ్యమయ్యే అన్ని అవకతవకలకు ముగింపు పలకడానికి, డేటా సెక్యూరిటీ ప్రోటోకాల్లను బలోపేతం చేయడానికి.. అలాగే NTAని సరిదిద్దడానికి ఇది కీలకమైనది’. అని ట్విట్టర్ వేదికగా ధర్మేంద్ర ప్రధాన్ పోస్ట్ చేశారు.
విద్యార్థుల అభిరుచులు, వారి ఉజ్వల భవిష్యత్తుకు ప్రభుత్వం ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందన్నారు కేంద్రమంత్రి. ఇక ఒక రోజు ముందుగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) పరీక్షలు సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది కేంద్ర విద్యాశాఖ. ఈ కమిటీకి మాజీ ఇస్రో చైర్మన్ డాక్టర్ కె. రాధాకృష్ణ చైర్మన్ గా వ్యవహరిస్తుండగా.. రణ్ దీప్ గులేరియా, బీజేపీ రావు, ప్రొఫెసర్ రామమూర్తి, పంకజ్ బన్సల్, ఆదిత్య మిట్టల్, గోవింద్ జైస్వాల్ సభ్యులుగా ఉండనున్నారు.
ఇదిలా ఉండగా, దేశవ్యాప్తంగా జరిగే పబ్లిక్ పరీక్షలు, సాధారణ ప్రవేశ పరీక్షలలో అవకతవకలను నిరోధించే లక్ష్యంతో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టం, 2024 శుక్రవారం నుండి అమలులోకి వచ్చింది. నిపుణుల కమిటీ పరీక్షా విధానంలో సంస్కరణలు, డేటా సెక్యూరిటీ ప్రోటోకాల్స్లో మెరుగుదల, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) పనితీరుపై సిఫార్సులు చేస్తుంది. ఈ కమిటీ తన నివేదికను రెండు నెలల్లోగా కేంద్ర విద్యాశాఖకు సమర్పించనుంది.
Transparent, tamper-free and zero-error examinations is a commitment.
Setting up of the high-level committee of experts is the first of a series of step to improve efficiency of the examination process, put an end to all possible malpractices, strengthen data security protocols… https://t.co/LDUe4udfXY
— Dharmendra Pradhan (@dpradhanbjp) June 22, 2024