Kumbh Mela 2021: ఆ యాత్రికులకు 14 రోజుల క్వారంటైన్ తప్పనిసరి.. కీలక నిర్ణయం తీసుకున్న ఢిల్లీ ప్రభుత్వం

|

Apr 18, 2021 | 10:37 AM

Delhi Govt - Kumbh Mela: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. నిత్యం లక్షల కేసులు వెలుగులోకి వస్తుండగా.. వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. అత్యధికంగా మహారాష్ట్రతోపాటు ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య..

Kumbh Mela 2021: ఆ యాత్రికులకు 14 రోజుల క్వారంటైన్ తప్పనిసరి.. కీలక నిర్ణయం తీసుకున్న ఢిల్లీ ప్రభుత్వం
Maha Kumbhmela
Follow us on

Delhi Govt – Kumbh Mela: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. నిత్యం లక్షల కేసులు వెలుగులోకి వస్తుండగా.. వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. అత్యధికంగా మహారాష్ట్రతోపాటు ఢిల్లీ కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఈ క్రమంలోనే ఉత్తరఖండ్‌లోని హరిద్వార్‌లో కుంభమేళా కొనసాగుతోంది. అక్కడకు వెళుతున్న భక్తులు, సాధువులకు సైతం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవుతోంది. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి. కుంభమేళా నుంచి వచ్చే భక్తులు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నాయి. ఈ క్రమంలో.. కుంభమేళాలో పాల్గొని వచ్చే భక్తులపై ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం పలు ఆంక్షలను విధించింది. హరిద్వార్‌ కుంభమేళాను సందర్శించి తిరిగి వచ్చే ఢిల్లీ వాసులు తప్పనిసరిగా 14 రోజులపాటు హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందేనంటూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవంటూ ఢిల్లీ ప్రభుత్వం హెచ్చరించింది. దేశ రాజధానిలో భారీగా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు కేజ్రీవాల్‌ ప్రభుత్వం పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఏప్రిల్ 14 నుంచి 17 వరకు జరిగిన కుంభమేళాలో పాల్గొన్న భక్తులు 24 గంటల్లో తమ వివరాలను ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ఇచ్చిన లింక్ ద్వారా అప్‌లోడ్ చేయాలని సూచించింది. అలాగే నేటి నుంచి ఈ నెల 30 వరకు కుంభమేళాకు వెళ్లాలనుకునే వారు కూడా తమ వివరాలను అప్‌లోడ్ చేయాలని  స్పష్టంచేసింది. దీనివల్ల కుంభమేళా వెళ్లిన వారిన ట్రేస్ చేయడం ప్రభుత్వానికి సులభమవుతుందని వెల్లడించింది. కుంభమేళాను సందర్శించి తమ వివరాలు అప్‌లోడ్ చేయని వారిని రెండు వారాలపాటు ప్రభుత్వ నిర్భంద క్వారంటైన్‌కు పంపుతామని హెచ్చరించింది. కాగా ఢిల్లీలో పెరుగుతున్న కేసులను దృష్టిలో ఉంచుకొని శుక్రవారం అర్థరాత్రి నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకూ వీకెండ్‌ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. కాగా ఢిల్లీలో గత 24గంటల్లో 24,374 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఢిల్లీలో 70వేల కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

ఇదిలాఉంటే.. మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం కూడా ఇలాంటి ఆదేశాలనే జారీ చేసింది. కుంభ‌మేళాకు వెళ్లివచ్చిన‌ వారిని క్వారంటైన్‌కు త‌ర‌లించాల‌ని అన్ని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. కుంభ‌మేళా నుంచి వ‌చ్చిన‌వారు అధికారుల‌కు స‌మాచారం అంచించాల‌ని స్పష్టం చేసింది. కాగా.. గుజ‌రాత్, క‌ర్ణాట‌క ప్రభుత్వాలు సైతం కుంభ‌మేళా యాత్రికుల‌కు ఆర్టీపీసీఆర్ పరీక్షలను తప్పనిసరిచేస్తూ ఉత్తర్వులిచ్చాయి.

Also Read:

India Corona: భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం.. రికార్డ్ స్థాయిలో నమోదైన పాజిటీవ్ కేసులు.. భారీగా పెరిగిన మరణాలు..

Medical Oxygen: ఆదుకుంటాం.. ఆక్సిజన్ కొరతపై స్పందించిన కేంద్ర ఆరోగ్యమంత్రి హర్ష వర్ధన్.. ఏమన్నారంటే?