32 మంది ప్రయాణికులతో వస్తున్న విమానానికి బాంబ్ బెదిరింపు.. అహ్మదాబాద్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్

సౌదీ అరేబియాలోని దమ్మామ్ నుంచి దిల్లీ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. విమానంలో బాంబు ఉందంటూ ఏటీసీకి సమాచారం రావడంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు విమానాన్ని ఎయిర్‌పోర్టులో సురక్షితంగా దించారు. అనంతరం బాంబ్‌ స్క్వాడ్ వచ్చి తనిఖీ చేయగా ఎలాంటి అనుమానాస్పద వస్తువులు దొరకకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

32 మంది ప్రయాణికులతో వస్తున్న విమానానికి బాంబ్ బెదిరింపు.. అహ్మదాబాద్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
Air India Bomb Threat

Updated on: Aug 31, 2026 | 7:45 PM

దేశంలోని విమానాలకు వరుస బాంబు బెదిరింపు ఘటనలు కలకలం రేపుతున్నాయి. తాజాగా మరో ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు రావడంతో విమానాన్ని అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఉదయం 10.25 గంటలకు సుమారు 32 మంది ప్రయాణికులతో ఎయిర్‌ ఇండియాకు చెందిన విమానం సౌదీ అరేబియాలోని దమ్మామ్ నుంచి దిల్లీకి బయల్దేరింది. అయితే విమానం మార్గమధ్యంలో ఉండగా, అందులోని వాష్‌రూమ్‌లో “విమానంలో బాంబు ఉంది” అని రాసి ఉన్న ఒక చిన్న చీటీ సిబ్బందికి దొరికింది.

దీంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఏటీసీకి సమాచారం అందించడంతో విమానాన్ని వెంటనే అహ్మదాబాద్‌ విమానాశ్రయానికి మళ్లించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయించారు. అనంతరం విమానంలోని ప్రయాణికులందరినీ సురక్షితంగా టెర్మినల్-2కు తరలించి, ప్రత్యేక భద్రతా ప్రాంతంలో ఉంచారు. విమానంలో బాంబు ఉందేమోనని రంగంలోకి దిగిన భద్రతా సిబ్బంది, బాంబ్‌ స్క్వాడ్ క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టగా ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదని స్పష్టం చేశారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us