Covid-19 Vaccine: కొవిడ్ వ్యాక్సిన్లు రక్షణ కవచాలే.. తాజా అధ్యయనంలో తేలిన ఆసక్తికర విషయాలు

|

Jun 23, 2021 | 11:30 AM

కరోనా మహమ్మారిని ఎదుర్కొనే విషయంలో వ్యాక్సిన్లు రక్షణ కవచాల్లా నిలుస్తున్నాయి. కొవిడ్ వ్యాక్సిన్ల సామర్థ్యంపై నిర్వహించిన ఓ తాజా అధ్యయనంలోనూ ఇదే విషయం నిర్ధారణ అయ్యింది.

Covid-19 Vaccine: కొవిడ్ వ్యాక్సిన్లు రక్షణ కవచాలే.. తాజా అధ్యయనంలో తేలిన ఆసక్తికర విషయాలు
Covid Vaccine
Follow us on

కరోనా మహమ్మారిని ఎదుర్కొనే విషయంలో వ్యాక్సిన్లు రక్షణ కవచాల్లా నిలుస్తున్నాయి. కొవిడ్ వ్యాక్సిన్ల సామర్థ్యంపై నిర్వహించిన ఓ తాజా అధ్యయనంలోనూ ఇదే విషయం నిర్ధారణ అయ్యింది. ఒక డోస్ వ్యాక్సిన్ తీసుకున్నా మరణం నుంచి 82శాతం మేర రక్షణ లభిస్తుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ – నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడమాలజీ (ICMR-NIE) అధ్యయనంలో తేలింది. రెండు డోస్‌ల వ్యాక్సిన్ తీసుకున్న వారికి మరణం నుంచి 95 శాతం రక్షణ లభిస్తున్నట్లు తేలింది. తమిళనాడులో హై రిస్క్ గ్రూప్స్‌లో కొవిడ్ మరణాలను నివారించడంలో వ్యాక్సిన్లు ఎలా పనిచేస్తున్నాయన్న అంశంపై ఈ అధ్యయనం నిర్వహించారు. ఈ అధ్యయన నివేదికను ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌లో జూన్ 21న ప్రచురించారు. తమిళనాడు పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో వ్యాక్సిన్ వేసుకోని వారు, తొలి వ్యాక్సిన్ వేసుకున్న వారు, రెండు డోస్‌ల వ్యాక్సిన్(కోవాక్సిన్ లేదా కోవిషీల్డ్) వేసుకున్న వారిలో సెకండ్ వేవ్‌లో సంభవించిన కరోనా మరణాలను విశ్లేషించారు. వ్యాక్సిన్లు తీసుకున్న వారు, తీసుకోని వారి మధ్య మరణాల సంఖ్యలో తేడాను పోల్చిచూశారు.

తమిళనాడు పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో మొత్తం 1,17,524 మంది పనిచేస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుంచి మే 14 వరకు 32,792 మంది మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకోగా…67,673 మంది రెండు డోస్‌లు తీసుకున్నారు. 17,059 మంది వ్యాక్సిన్ తీసుకోలేదు. ఇదే కాలంలో తమిళనాడు పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో 31 మరణాలు నమోదయ్యాయి. మృతుల్లో రెండు వ్యాక్సిన్లు తీసుకున్న వారు నలుగురు మాత్రమే. ఒక డోస్ తీసుకున్న వారు ఏడుగురు ఉన్నారు. మిగిలిన 20 మంది ఒక్క వ్యాక్సిన్ డోస్ కూడా తీసుకోలేదు. వ్యాక్సిన్ వేసుకున్న వారితో పోల్చితే వ్యాక్సిన్ తీసుకోని వారిలో మరణాల రేటు గణనీయంగా ఉన్నట్లు ఈ గణాంకాలతో నిర్ధారణ అయినట్లు నిపుణులు వెల్లడించారు.

వ్యాక్సిన్ తీసుకోని ప్రతి 1000 మందిలో 1.17 మంది కోవిడ్ బారినపడి మృతి చెందారు. ఒక డోస్ తీసుకున్న వారిలో 0.21 మంది, రెండు డోస్‌లు తీసుకున్న వారిలో 0.06 మంది మృతి చెందారు. కరోనా మహమ్మారి పట్ల వ్యాక్సిన్లు సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు తమ అధ్యయనంలో తేలినట్లు డాక్టర్ ముర్కేకర్ వెల్లడించారు.

అందరికీ వ్యాక్సిన్.. అందరికీ ఆరోగ్యం.. టీవీ9 నినాదం.. దేశం విధానం. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా టీకా వేయించుకుని కరోనా మమమ్మారి నుంచి రక్షణ పొందాలని టీవీ9 కోరుకుంటోంది.

Also Read..

దేశంలో మళ్లీ పెరిగిన పాజిటివ్! కేసులు, మరణాలు.. కొత్తగా ఎన్నంటే