Congress President Election: కాంగ్రెస్ అధ్యక్షుడిగా నిలిచేదెవరు..? ఎన్నికల కోసం ఏర్పాట్లు పూర్తి..

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం (అక్టోబర్ 17) ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది.

Congress President Election: కాంగ్రెస్ అధ్యక్షుడిగా నిలిచేదెవరు..? ఎన్నికల కోసం ఏర్పాట్లు పూర్తి..
Congress President Election

Updated on: Oct 16, 2022 | 9:07 PM

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం (అక్టోబర్ 17) ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. ఈ మేరకు ఏఐసీసీ అన్ని ఏర్పాట్లు చేసింది. కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి కోసం మల్లికార్జున్‌ ఖర్గే, శశిథరూర్‌ పోటీ పడుతున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ దేశవ్యాప్తంగా 36 పోలింగ్ స్టేషన్లలో 67 పోలింగ్ బూత్‌ల ఏర్పాటు చేసింది. 9,300 మందికి పైగా ప్రతినిధులు పార్టీ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ప్రతి రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గానికి ఇద్దరు చొప్పున ప్రతినిధులు ఓటు వేయనున్నారు. ఢిల్లీ, ముంబై లాంటి మెట్రో నగరాల్లో మున్సిపల్ సీటు ప్రాతిపదికన ప్రతినిధులను ఎంపిక చేశారు. ప్రతి పోలింగ్ బూత్ లో గరిష్టంగా 200 మంది ఓటు వేసే అవకాశం ఉంది. భారత్ జోడోయాత్రలో భాగంగా ప్రత్యేకంగా యాత్ర క్యాంపు వద్ద ఒక బూత్ ఏర్పాటు చేశారు. రాహుల్ గాంధీతో పాటు యాత్రలో ఉన్న ఏఐసీసీ నేతలు క్యాంపు బూత్‌లోనే ఓటు వేయనున్నారు.

ఈనెల 19న ఓట్ల లెక్కింపు

ఓటింగ్‌ పూర్తయిన తరువాత బ్యాలెట్ బాక్సులు ఢిల్లీకి తరలించి, ఈనెల 19న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అదేరోజు ఫలితాన్ని వెలువరించనున్నారు.

తెలంగాణలో 238 మంది ఓటర్లు..

తెలంగాణలో ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల కోసం హైదరాబాద్‌ గాంధీభవన్ లో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. తెలంగాణ పీసీసీ సభ్యులు గాంధీ భవన్‌లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. తెలంగాణ లో 238 మంది ఓటర్లు ఉన్నారు. ఏఐసిసి ఎన్నికల ఇన్‌ఛార్జులుగా తెలంగాణకు రాజ్ మనోహర్ ఉన్నితన్, రాజ బగేల్ చేరుకున్నారు. రాజ్ మనోహర్ ఉన్నితన్ పీఆర్వోగా.. రాజ బగేల్ ఏపీఆర్వో వ్యవహరించనున్నారు. ఖర్గే తరుపున ఎన్నికల ఏజెంట్లుగా షబ్బీర్ అలీ, మల్లు రవి వ్యవహరించనున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..