Kishan Reddy: కృష్ణంరాజు చూపించిన ఆప్యాయతను ఎన్నటికీ మరువలేను: మంత్రి కిషన్‌రెడ్డి

Kishan Reddy: రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస..

Kishan Reddy: కృష్ణంరాజు చూపించిన ఆప్యాయతను ఎన్నటికీ మరువలేను: మంత్రి కిషన్‌రెడ్డి
Kishan Reddy

Updated on: Sep 11, 2022 | 11:01 AM

Kishan Reddy: రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపై పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ఇక కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి జి. కిషన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.

‘రెబల్ స్టార్’గా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే ఉప్పలపాటి కృష్ణంరాజు ఇకలేరని తెలిసి విచారం వ్యక్తం చేశారు. పాత్రికేయుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించి నటుడిగా, బీజేపీ నాయకుడిగా, కేంద్ర మంత్రిగా, పారిశ్రామిక వేత్తగా అవకాశం వచ్చిన ప్రతిచోటా తనదైన ముద్రవేసుకున్న మహనీయుడు శ్రీ కృష్ణంరాజు అని అన్నారు.ఆ నిరంతరం ప్రజల శ్రేయస్సును ఆలోచించిన గొప్ప మనిషి అని అన్నారు.

బీజేపీ పార్టీలో చేరి ఎంపీగా రెండుసార్లు (కాకినాడ, నరసాపురం) గెలిచిన కృష్ణంరాజు నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో వివిధ మంత్రిత్వ సహాయ మంత్రిగా బాధ్యతలను నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ కోసం వారితో కలిసి పనిచేసిన సందర్భాలను, వారు చూపించిన ఆప్యాయతను ఎన్నటికీ మరువలేనని కిషన్‌రెడ్డి అన్నారు.

ఇవి కూడా చదవండి

నటుడిగా శ్రీ కృష్ణంరాజు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకున్నారు. దాదాపు 200 సినిమాల్లో తన ప్రతిభను ప్రదర్శించిన ఆయన, విలక్షణ నటుడిగా ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయారు. రాజకీయాల్లో క్రియాశీలకంగా మారినప్పటికీ తెలుగు చిత్ర పరిశ్రమ పట్ల వారికున్న బంధాన్ని వీడలేదు. నిజ జీవితంలో, రాజకీయ జీవితంలో నిబద్ధతో మెలిగిన కృష్ణం రాజు తెలుగు సినిమా పరిశ్రమ క్రమశిక్షణ కమిటీకి చైర్మన్ గా వ్యవహరించారు.

అలాంటి మంచి మనిషి మరణం బీజేపీ పార్టీకి, వ్యక్తిగతంగా నాకు, సమాజానికి, చిత్ర పరిశ్రమకు తీరని లోటని, వారి ఆత్మకు శాంతిచేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us