CBSE మూల్యాంకనంపై ముదురుతున్న వివాదం.. టెండర్లపై అనుమానాలు.. రంగంలోకి కేంద్ర విద్యా శాఖ!

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 12వ తరగతి ఫలితాల చుట్టూ వివాదం రోజురోజుకూ ముదురుతోంది. కొత్తగా ప్రవేశపెట్టిన 'డిజిటల్ ఆన్-స్క్రీన్ మార్కింగ్' (OSM) విధానం లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంలో పడేసిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో, టెండర్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై కేంద్ర విద్యా శాఖ అంతర్గత దర్యాప్తును వేగవంతం చేసింది.

CBSE మూల్యాంకనంపై ముదురుతున్న వివాదం.. టెండర్లపై అనుమానాలు..  రంగంలోకి కేంద్ర విద్యా శాఖ!
Cbse Osm Coempt Edutech Controversy

Updated on: Jun 02, 2026 | 4:45 PM

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 12వ తరగతి ఫలితాల చుట్టూ వివాదం రోజురోజుకూ ముదురుతోంది. కొత్తగా ప్రవేశపెట్టిన ‘డిజిటల్ ఆన్-స్క్రీన్ మార్కింగ్’ (OSM) విధానం లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంలో పడేసిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో, టెండర్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై కేంద్ర విద్యా శాఖ అంతర్గత దర్యాప్తును వేగవంతం చేసింది.

ఈ వివాదంలో ప్రధానంగా ‘కోఎంప్ట్ ఎడ్యుటెక్’ (Coempt Edutech) అనే సంస్థ పేరు వినిపిస్తోంది. ఈ కంపెనీకి లబ్ధి చేకూర్చేలా టెండర్ నిబంధనలను ఉద్దేశపూర్వకంగా మార్చారని కేంద్ర విద్యా శాఖ అనుమానిస్తోంది. ఆ సంస్థకు సంబంధించిన రికార్డులను అధికారులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, గతంలో తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల గందరగోళంలో చిక్కుకున్న ‘గ్లోబరీనా’ సంస్థే.. ఇప్పుడు పేరు మార్చుకుని ‘కోఎంప్ట్ ఎడ్యుటెక్’గా అవతరించినట్లు దర్యాప్తులో తేలింది. ఇంతటి వివాదాస్పద చరిత్ర ఉన్న సంస్థకు కీలకమైన సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షల మూల్యాంకన బాధ్యతలను ఎలా అప్పగించారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఈసారి 12వ తరగతి ఉత్తీర్ణత శాతం ఒక్కసారిగా 85 శాతానికి పడిపోవడం విద్యార్థులను, తల్లిదండ్రులను విస్మయానికి గురిచేసింది. OSM విధానంలో జరిగిన లోపాల వల్ల సప్లిమెంటరీ షీట్లపై మార్కులు వేయకపోవడం, రాసిన సమాధానాలకు పొంతన లేని మార్కులు కేటాయించడం వంటి ఘటనలు వెలుగుచూశాయి. ఇది కేవలం వ్యవస్థాత్మక లోపమా? లేక టెండర్ల కేటాయింపులో జరిగిన అవినీతి వల్ల తలెత్తిన సాంకేతిక సామర్థ్య లోపమా? అన్న కోణంలో విచారణ సాగుతోంది.

విద్యార్థుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవ్వడంతో, CBSE ఎట్టకేలకు మార్కుల పునఃపరిశీలన కోసం ఆన్‌లైన్ పోర్టల్‌ను ప్రారంభించింది. షెడ్యూల్ ప్రకారం ముందుగానే ప్రారంభం కావాల్సి ఉన్నా, సాంకేతిక కారణాలతో ఆలస్యంగా మంగళవారం (జూన్ 02) అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే 4 లక్షలకు పైగా విద్యార్థులు తమ జవాబు పత్రాల స్కాన్ చేసిన కాపీల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. దరఖాస్తు ప్రక్రియలో గందరగోళం లేకుండా ఉండేందుకు CBSE ఒక డెమో వీడియోను కూడా విడుదల చేసింది.

లక్షలాది మంది విద్యార్థుల మార్కుల్లో తేడాలు రావడం, రీవాల్యుయేషన్ వరకు పరిస్థితి వెళ్లడంతో దేశవ్యాప్తంగా ఆరోపణలు వెల్లువెత్తాయి. పేపర్లలో సప్లిమెంటరీ షీట్స్‌ మీద మూల్యాంకనం లేకపోవడం, మార్కింగ్‌ విషయంలో తేడాలు కనిపించాయంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా, వెరిఫికేషన్‌లో భాగంగా విద్యార్థులు పొందిన ఆన్సర్‌ షీట్లలో తాము రాసిన వాటికి పొంతన లేవనే ఆరోపణలు వచ్చాయి. ఈ మొత్తం వ్యవహారంపై దేశవ్యాప్తంగా ఇప్పటికే నిరసనలు పెల్లుబికాయి. ఒకవైపు CBSE ఈ ఆరోపణలను తోసిపుచ్చుతూ ప్రక్రియ పారదర్శకంగానే జరిగిందని చెబుతున్నప్పటికీ, విద్యా శాఖ దర్యాప్తులో తేలే నిజాలే కీలకం కానున్నాయి. అన్యాయం జరిగిన ప్రతి విద్యార్థికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని విద్యార్థి సంఘాలు హెచ్చరిస్తున్నాయి.

మరిన్ని కెరీర్ – ఉద్యోగ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us