
దేశంలో భారీ బ్యాంకింగ్ మోసాలకు ఒడిగట్టి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరస్థులపై భారత కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) ఉక్కుపాదాన్ని మోపుతోంది. సుమారు రూ. 88 కోట్ల ఆర్థిక నేరం, నిధుల దారిమళ్లింపు కేసులో ప్రధాన నిందితురాలిగా ఉంటూ గత కొంతకాలంగా పరారీలో ఉన్న మోస్ట్వాంటెడ్ క్రిమినల్ విశాఖ రాథోడ్ను అరబ్ ఎమిరేట్స్ (UAE) అధికారులు భారతదేశానికి అప్పగించారు. ఇంటర్పోల్, సీబీఐ గ్లోబల్ ఆపరేషన్స్ సెంటర్, యూఏఈ భద్రతా ఏజెన్సీలు సంయుక్తంగా నిర్వహించిన ఈ అంతర్జాతీయ ఆపరేషన్ ఫలితంగా ఆమెను గురువారం ప్రత్యేక విమానంలో భారత్కు విజయవంతంగా తీసుకువచ్చారు. ఇన్వెస్టర్లను మోసగించి భారీ స్థాయిలో డబ్బు కాజేసిన విశాఖ రాథోడ్పై ఇంటర్ పోల్ గతంలో రెడ్ కార్నర్ నోటీస్ జారీచేసింది. ఆమెను పుణె ఎయిర్పోర్ట్లో మహారాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బాధితులు, బ్యాంకుల ఫిర్యాదుల ఆధారంగా నమోదు చేసిన ఈ భారీ కుంభకోణం కేసులో విశాఖ రాథోడ్ ప్రధాన పాత్ర పోషించినట్లు దర్యాప్తు సంస్థలు ఇప్పటికే గుర్తించాయి. విభిన్న బ్యాంకుల నుంచి రుణాలు, ఆర్థిక సదుపాయాల రూపంలో పొందిన సుమారు రూ. 88 కోట్ల భారీ మొత్తాన్ని ఆమె, ఆమెతో కూడిన ముఠా దారిమళ్లించి ఎగవేసింది. ఈ మోసం వెలుగుచూసిన వెంటనే చట్టపరమైన విచారణ నుంచి తప్పించుకోవడానికి ఆమె విదేశాలకు పరారై యూఏఈలో తలదాచుకుంది. కేసు దర్యాప్తును వేగవంతం చేసిన సీబీఐ, ఆమెను భారత్కు తీసుకురావడానికి ఇంటర్పోల్ ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ‘రెడ్ నోటీస్’ జారీ చేయించింది.
ఈ రెడ్ నోటీస్ ఆధారంగా యూఏఈ అధికారులు విశాఖ రాథోడ్ కదలికలపై నిఘా ఉంచి, ఆమెను అదుపులోకి తీసుకున్నారు. తదనంతరం ఇరు దేశాల మధ్య ఉన్న దౌత్య, చట్టపరమైన ఒప్పందాల ప్రకారం ఆమెను భారత్కు పంపించే ప్రక్రియను పూర్తి చేశారు.
ఆమెను అధికారికంగా అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు.. నిధులు ఎక్కడికి మళ్లించారు, ఈ కుంభకోణంలో ఇంకా ఎవరెవరు ఉన్నారు.. అనే కోణంలో విచారించేందుకు ఆమెను ప్రత్యేక సీబీఐ కోర్టు ముందు హాజరుపరిచి కస్టడీకి కోరనున్నారు. విదేశాల్లో దాక్కున్న ఆర్థిక నేరస్థులను స్వదేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం.. గ్లోబల్ పోలీసింగ్ సమన్వయంతో పలువురిని రప్పించేందుకు ప్రణాళికలను రచిస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..