సీట్ల పంపకాలపై అమిత్‌షాకు ఘాటైన లేఖ రాసిన చిరాగ్‌ పాశ్వాన్‌

బీహార్‌ రాజకీయాలను యువతరం శాసిస్తోంది.. పొత్తుల తకరారు, సీట్ల పంపకాలపై కొత్తతరం నిర్ణయాత్మక పాత్ర పోషిస్తోంది.. అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కావడంతో కూటములలో సీట్ల పంపకాల చర్చలు మొదలయ్యాయి..

సీట్ల పంపకాలపై అమిత్‌షాకు ఘాటైన లేఖ రాసిన చిరాగ్‌ పాశ్వాన్‌

Updated on: Sep 28, 2020 | 11:26 AM

బీహార్‌ రాజకీయాలను యువతరం శాసిస్తోంది.. పొత్తుల తకరారు, సీట్ల పంపకాలపై కొత్తతరం నిర్ణయాత్మక పాత్ర పోషిస్తోంది.. అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కావడంతో కూటములలో సీట్ల పంపకాల చర్చలు మొదలయ్యాయి.. జేయూడీ- బీజేపీ, ఎల్‌జేపీ కూటమిని అధికారంలోకి మళ్లీ రానివ్వకూడదనే ఉద్దేశంతో ఆర్జేడీ-కాంగ్రెస్‌ కూటమి ఉంది.. అందుకే ఆ రెండు పార్టీల మధ్య అవగాహన కుదిరిపోయింది.. ఎవరికెన్నేన్ని సీట్లు అన్న విషయంలో ఇప్పటి వరకైతే క్లారిటీ రాలేదు కానీ.. ఈ విషయంలో కాంగ్రెస్‌ బెట్టు చేసే పరిస్థితులైతే కనిపించడం లేదు..ఎందుకంటే ఆర్జేడీ ఇచ్చిన సీట్లు పుచ్చుకోవడం తప్ప కాంగ్రెస్‌కు డిమాండ్‌ చేసే అవకాశం లేదు.. పైగా ఈ మహాగడ్బంధన్‌లో మరికొన్ని పార్టీలు చేరవచ్చు.. ఎటొచ్చి అధికారకూటమి ఎన్‌డీఏకే సీట్ల పంపకం తలనొప్పిగా మారింది.. జేడీయూ-బీజేపీ మధ్య ఎలాంటి గొడవలు లేకపోయినా రామ్‌విలాస్‌పాశ్వాన్‌ నేతృత్వంలోని లోక్‌జనశక్తి పార్టీనే తకరారు పెడుతోంది.. జేడీయూ ప్రతిపాదిస్తున్న 50-50 ఫార్మాలాను తమకు కూడా వర్తింపచేయాలని డిమాండ్‌ చేస్తోంది. లేకపోతే తమదారి తాము చూసుకుంటామని బెదిరిస్తోంది.. మొదటి నుంచి నితీశ్‌కుమార్‌కు వ్యతిరేకంగానే ఎల్‌జేపీ వెళుతున్నది.. ఆ పార్టీ చీఫ్‌ చిరాగ్‌ పాశ్వాన్‌ అయితే ప్రభుత్వంపై భాగస్వామిగా ఉంటూనే నితీశ్‌పై పలుమార్లు విమర్శలు చేశారు. చిరాగ్‌ పాశ్వాన్‌ చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు.. సీట్ల పంపకాల విషయంలో మీనమేషాలు లెక్కించడం సరికాదని, తమకు ఎన్ని సీట్లు కేటాయిస్తారో వెంటనే చెప్పండని అమిత్‌షాకు పెద్ద ఉత్తరమే రాశారాయన! జనతాదళ్‌ యునైటెడ్‌ వ్యవహారశైలిపై కంప్లయింట్ కూడా చేశారు.. జేడీయూ ఇలాగే ప్రవర్తిస్తే మాత్రం కూటమిలో ఉండబోమని లేఖలో తేల్చేశారు. నరేంద్రమోదీపై తమకు విశ్వాసం ఉందని, జేడీయూతోనే తగవంతా అని చిరాగ్‌ అంటున్నారు. మొత్తం మీద బీహార్‌లో కరోనా కంటే ఎన్నికల ప్రస్తావనే ఎక్కువగా వినిపిస్తోంది..

Follow Us