
మరికాసేపట్లో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధమైంది. ఉదయం 10 గంటల కల్లా ట్రెండ్ తెరపైకి రానుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను ఆ తరువాత ఈవీఎం ఓట్లను లెక్కిస్తారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర భారీ భద్రతను ఏర్పాటు చేశారు. తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు ఉంటే కౌంటింగ్ కోసం 62 సెంటర్లను ఏర్పాటు చేశారు. పవర్ను చేజిక్కించుకోవాలంటే కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 118. ఈసారి తమిళనాట రికార్డు స్థాయిలో 85శాతానికి పైగా పోలింగ్ జరిగింది. భారీ ఓటింగ్ ఎవరికి ప్లస్ ? ఎవరికి మైనస్? అనే చర్చ జరుగుతోంది. తమిళనాడ DMK మళ్లీ అధికారాన్ని కైవసం చేసుకుంటుందా? సూపర్ స్టార్ విజయ్ TVK పార్టీ పవర్ను పుల్ చేస్తుందా? అనేది ఆసక్తిగా మారింది.
ఇక పశ్చిమ బెంగాల్లో 294 అసెంబ్లీ స్థానాలు ఉండగా రెండు విడతల్లో పోలింగ్ నిర్వహించారు. 93 శాతం ఓటింగ్ నమోదయింది. అధికారం చేపట్టడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 148. కౌంటింగ్ కోసం 77 సెంటర్లను ఏర్పాటు చేశారు. ఈసారి మళ్లీ టీఎంసీనే పగ్గాలు చేజిక్కించుకుంటుందా? లేదంటే బీజేపీ పాగా వేయబోతుందా?ఈసారి బెంగాల్ టైగర్ ఎవరన్నది ఉత్కంఠ రేపుతోంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు బీజేపీకి ఎడ్జ్నిచ్చాయి. ఐతే పక్కా లెక్క ఏంటో మరికాసేపట్లో తేలనుంది.
ఇక కేరళలో కేరళలో మొత్తం 140 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఓట్ల లెక్కింపుకు 140 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. మ్యాజిక్ ఫిగర్ 71. ఈసారి 78 శాతానికి పైగా ఓటింగ్ జరిగింది. పినరయి విజయన్ మళ్లీ సర్కార్ ఏర్పాటు చేస్తారా? UDF పవర్లోకి వస్తుందా? కమలానికి ఈసారి కలిసివస్తుందా?. కేరళలో ఏం జరగబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. 126 అసెంబ్లీ స్థానాలున్న అసోంలో ఈసారి 85శాతానికి పైగా పోలింగ్ జరిగింది. ఓట్ల లెక్కింపుకు 40 కౌంటింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. మ్యాజిక్ ఫిగర్ 64. మళ్లీ బీజేపీ సర్కార్ వస్తుందని సర్వే సంకేతాలిచ్చాయి. సర్వే అంచనాలే నిజమవుతాయా? లేదంటే లెక్క మారుతుందా? అనేది మరికాసేపట్లో తేలనుంది. పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలు ఉండగా ఈ సారి 90 శాతం పోలింగ్ జరిగింది. ఓట్ల లెక్కింపు 6 కేంద్రాల్లో జరుగుతుంది. మళ్లీ తామే పవర్లోకి రావడం ఖాయమని బీజేపీ నేతలు ధీమాగా ఉన్నారు.