
థాయ్లాండ్ పర్యటన ఓ భారతీయ కుటుంబానికి ఊహించని చేదు అనుభవాన్ని మిగిల్చింది. పులితో సెల్ఫీ తీసుకునే క్రమంలో దాని పంజా తగిలి ఐదేళ్ల బాలికకు స్వల్ప గాయమైంది. ఆ తర్వాత తీవ్రమైన బాక్టీరియల్ ఇన్ఫెక్షన్కు గురై మృత్యు అంచుల వరకు వెళ్లి ప్రాణాలతో బయటపడింది. చిన్న గాయాన్ని నిర్లక్ష్యం చేస్తే ఎంతటి ప్రమాదం ఎదురవుతుందో ఈ ఘటన మరోసారి హెచ్చరిస్తోంది.
భారత్కు చెందిన ఓ కుటుంబం థాయ్లాండ్లోని పట్టాయాలో ఉన్న వన్యప్రాణి పార్కును సందర్శించింది. అక్కడ పర్యాటకులు పులులకు దగ్గరగా వెళ్లి వాటిని తాకుతూ ఫొటోలు, సెల్ఫీలు తీసుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఐదేళ్ల బాలిక కూడా పులిని నిమురుతూ ఫొటో దిగేందుకు ప్రయత్నించింది. అయితే అనుకోకుండా పులి పంజా తగలడంతో చిన్నారికి స్వల్ప గాయం అయింది.
వెంటనే బాలికకు థాయ్లాండ్లోని ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించారు. అనంతరం కుటుంబంతో కలిసి భారత్కు తిరిగి వచ్చింది. అయితే సుమారు రెండు వారాల తర్వాత పరిస్థితి ఒక్కసారిగా విషమించింది. తొడలు, ముఖం, శరీరంపై తీవ్రమైన దద్దుర్లు రావడంతో పాటు జ్వరం, వాంతులు, తీవ్రమైన కడుపునొప్పి, వేగంగా గుండె కొట్టుకోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలు కనిపించాయి.
జూలై 10న బాలికను ఆసుపత్రిలో చేర్పించగా, వైద్యులు పరీక్షలు నిర్వహించారు. పులి గోరు వల్ల ఏర్పడిన గాయం ద్వారా బాక్టీరియా శరీరంలోకి ప్రవేశించి తీవ్రమైన ఇన్ఫెక్షన్కు దారితీసినట్లు నిర్ధారించారు. పీడియాట్రిక్స్, ఇమ్యునాలజీ వైద్యుల బృందం నిరంతరం పర్యవేక్షిస్తూ చికిత్స అందించింది. సుదీర్ఘ పోరాటం అనంతరం బాలిక కోలుకోవడంతో 13 రోజుల తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.
ఈ ఘటన నేపథ్యంలో వైద్యులు కీలక సూచనలు చేస్తున్నారు. పులి, కుక్క, పిల్లి, కోతి వంటి జంతువులు కరిచినా, గీరినా గాయం చిన్నదిగా కనిపించినా నిర్లక్ష్యం చేయకూడదని చెబుతున్నారు. వెంటనే సబ్బు, శుభ్రమైన నీటితో గాయాన్ని కడిగి వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా జంతువులతో సెల్ఫీలు తీసుకోవడం, వాటిని తాకడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని పర్యాటకులకు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ బాలిక ఘటన..‘చిన్న గాయమే కదా’ అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు ఏర్పడొచ్చనే గట్టి హెచ్చరికగా నిలిచింది.
మరిని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..