Live in relationship: సహజీవనంపై కీలక తీర్పునిచ్చిన అలహాబాద్ హైకోర్టు.. ఏం చెప్పిందంటే

ఈ మధ్యకాలంలో చాలామంది యువతీ, యువకులు సహజీవనానికి అలవాటు పడ్డాడు. ప్రేమలో ఉన్నవారు తమ గురించి తాము పూర్తిగా అర్థం చేసుకునేందుకు ఇలాంటి విధానాన్ని అనుసరిస్తున్నారు. ముఖ్యంగా నగరాల్లో లివ్ ఇన్ రిలేషన్ ఎక్కువగా చేస్తున్నారు. మరో విషయం ఏంటంటే 18 ఏళ్ల కంటే తక్కువ వయసున్న కొంతమంది మైనర్లు కూడా సహజీవనం చేస్తున్నారు.

Live in relationship: సహజీవనంపై కీలక తీర్పునిచ్చిన అలహాబాద్ హైకోర్టు.. ఏం చెప్పిందంటే
Court

Updated on: Aug 02, 2023 | 8:13 PM

ఈ మధ్యకాలంలో చాలామంది యువతీ, యువకులు సహజీవనానికి అలవాటు పడ్డాడు. ప్రేమలో ఉన్నవారు తమ గురించి తాము పూర్తిగా అర్థం చేసుకునేందుకు ఇలాంటి విధానాన్ని అనుసరిస్తున్నారు. ముఖ్యంగా నగరాల్లో లివ్ ఇన్ రిలేషన్ ఎక్కువగా చేస్తున్నారు. మరో విషయం ఏంటంటే 18 ఏళ్ల కంటే తక్కువ వయసున్న కొంతమంది మైనర్లు కూడా సహజీవనం చేస్తున్నారు. అయితే ఇలా సహజీవనం చేయడంపై ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ హైకోర్టు స్పందించింది. 18 ఏళ్ల లోపు ఉన్నవారు సహజీవనం చేయడం చట్ట విరుద్దమని, అనైతికమని తేల్చి చెప్పింది. అలాగే సహజీవాన్ని వివాహపరమైన బంధంగా పరిగణించేందుకు కొన్ని పరిమితులు ఉన్నాయని కోర్టు పేర్కొంది. 18 ఏళ్ల లోపు ఉన్న ఒక అబ్బాయి.. తనకంటే ఎక్కువ వయసున్న అమ్మాయితో సహజీవనం చేస్తున్నాడనే కారణం వల్ల నేర విచారణ నుంచి అతనికి రక్షణ ఉండదని.. వారి చర్యలను చట్టపరమైనవి కాదని ధర్మాసనం తెలిపింది.

ఇక వివరాల్లోకి వెళ్తే కొద్దిరోజుల క్రితం ఉత్తరప్రదేశ్‌కు చెందిన 19 ఏళ్ల అమ్మాయి, 17 ఏళ్ల అబ్బాయి ఇంట్లో నుంచి వచ్చేసి ప్రయాగ్‌రాజ్‌లో సహజీవనం చేస్తున్నారు. ఆ అమ్మాయి కనిపించకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఆ తర్వాత వారి ఆచూకి తెలిసాక అమ్మాయి కుటుంబీకులు వారిద్దరిని బలవంతంగా వారి గ్రామంలోకి తీసుకెళ్లారు. ఆ తర్వాత అక్కడి నుంచి తప్పించుకున్న ఆ అమ్మాయి.. ఈ విషయం గురించి అంతా ఆ అబ్బయి తండ్రికి చెప్పింది. దీంతో ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే ఆ అబ్బాయిపై ఎలాంటి క్రిమినల్ చర్యలు తీసుకోకుండా రక్షించాలని అమ్మాయి మరో పిటిషన్ దాఖలు చేసింది. అయితే పిటీషన్లపై విచారణ జరిపిన అలహాబాద్ కోర్టు 18 ఏళ్ల లోపు ఉన్నవారు సహజీవనం చేయడం అనైతికమని పేర్కొంది. ఇద్దరు వ్యక్తులు ఇష్టపూర్వకంగా జీవించే హక్కు ఉంటుందని.. కానీ వాళ్లు మేజర్ అయి ఉండాలని ధర్మాసనం తెలిపింది. అయితే అమ్మాయి కుటుంబ సభ్యులు అబ్బాయిపై ఆరోపించిన నేరానికి ఎలాంటి ఆధారాలు కోర్టుకు సమర్పించలేదు. దీంతో నేరం జరిగిందనే అభిప్రాయానికి రాలేమని కోర్టు పేర్కొంది. ఈ సంఘటనపై మరింత విచారణ చేయాలని అధికారుల్ని ఆదేశించింది.

Follow Us