
న్యాయం ఆలస్యమవ్వడం అంటే న్యాయం నిరాకరించబడటమే అనే నానుడి ఈ కేసు విషయంలో అక్షరాలా నిజమైంది. దాదాపు 42 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఒక హత్య కేసులో 100 ఏళ్ల వృద్ధుడికి ఎట్టకేలకు ఉపశమనం లభించింది. తన జీవితంలో వంద వసంతాలు పూర్తి చేసుకున్న తరుణంలో అలహాబాద్ హైకోర్టు అతడిని నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది. ఈ కేసు ఉత్తరప్రదేశ్లోని హమీర్పూర్ జిల్లాకు చెందినది. 1982లో ఒక భూ వివాదంలో జరిగిన హత్యకు సంబంధించి ధని రామ్, సత్తి దీన్, మైకు అనే ముగ్గురు వ్యక్తులపై ఆరోపణలు వచ్చాయి. హమీర్పూర్ సెషన్స్ కోర్టు ధని రామ్, సత్తి దీన్లకు 1984లో జీవిత ఖైదు విధించింది. దీనిని సవాలు చేస్తూ ధని రామ్ అదే ఏడాది అలహాబాద్ హైకోర్టులో అప్పీల్ చేశారు. ఆ తర్వాత అతను బెయిల్పై విడుదలయ్యారు.
కేసు పెండింగ్లో ఉండగానే సహ నిందితుడు సత్తి దీన్ మరణించారు. ప్రధాన నిందితుడు మైకు పరారీలో ఉన్నాడు. చివరికి ఈ కేసులో ధని రామ్ మాత్రమే ఏకైక అప్పీలుదారుగా మిగిలిపోయారు. నాలుగు దశాబ్దాలు గడిచినా ఈ కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. ఈ మధ్య కాలంలో ధని రామ్ ఎన్నో సామాజిక ఇబ్బందులను, మానసిక ఆందోళనను అనుభవించారు.
జస్టిస్ చంద్ర ధారి సింగ్, జస్టిస్ సంజీవ్ కుమార్లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ కేసును విచారిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రాసిక్యూషన్ నిందితుడిపై ఉన్న ఆరోపణలను సహేతుకమైన సందేహానికి మించి నిరూపించడంలో పూర్తిగా విఫలమైంది. ఒక వ్యక్తి 40 ఏళ్ల పాటు నిందితుడిగా ముద్ర వేయించుకుని సమాజంలో ఎదుర్కొన్న అవమానాలు, అనిశ్చితిని కోర్టు విస్మరించలేదని తెలిపింది. ధని రామ్ వయస్సు, కేసు పెండింగ్లో ఉన్న కాలాన్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. అతని బెయిల్ బాండ్లను రద్దు చేసి, వెంటనే నిర్దోషిగా విడుదల చేయాలని ఆదేశించింది.
విచారణ సందర్భంగా ధని రామ్ తరపు న్యాయవాది వాదిస్తూ.. ప్రస్తుతం తన క్లయింట్ వయస్సు 100 ఏళ్లు ఉంటుందని, కేవలం మైకును ప్రేరేపించాడనే ఆరోపణతో ఇన్నాళ్లు శిక్ష అనుభవించడం అన్యాయమని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. చివరకు న్యాయం గెలిచినప్పటికీ, ఒక వ్యక్తి తన జీవితంలో అత్యంత విలువైన 40 ఏళ్లు కోర్టుల చుట్టూ తిరుగుతూ గడపాల్సి రావడం మన న్యాయవ్యవస్థలోని జాప్యానికి అద్దం పడుతోంది.