యుద్ధం వాళ్లది.. నెత్తురోడేది మనోళ్లా..? నిరుద్యోగులూ బీకేర్‌ఫుల్.. సమిధలవుతున్న భారతీయ యువకులు

|

Mar 09, 2024 | 12:45 PM

Russia-Ukraine war: యుద్ధానికి మనుషులు కావాలి.. ఇదొక ఉద్యోగ ప్రకటన. ఎస్.. రష్యా-ఉక్రెయిన్ జగడంలో మరణాల సంఖ్య పెరుగుతుంటే.. మనోళ్లే ఎందుకు చావాలి అనే చావుతెలివి తేటలు పుట్టాయి రష్యన్లకు. అంతే.. ఇండియా నుంచి అమాయకుల్ని అరువు తెచ్చుకుని.. వాళ్ల ప్రాణాలను పణంగా పెట్టి యుద్ధాన్ని షురూ చేస్తున్నారు. లేటెస్ట్‌గా సీబీఐ ఛేదించిన మానవ అక్రమ రవాణా నెట్‌వర్క్‌ చెబుతున్న కఠోర నిజం ఇదే మరి.

యుద్ధం వాళ్లది.. నెత్తురోడేది మనోళ్లా..? నిరుద్యోగులూ బీకేర్‌ఫుల్.. సమిధలవుతున్న భారతీయ యువకులు
Russia Ukraine War
Follow us on

Russia-Ukraine war: యుద్ధానికి మనుషులు కావాలి.. ఇదొక ఉద్యోగ ప్రకటన. ఎస్.. రష్యా-ఉక్రెయిన్ జగడంలో మరణాల సంఖ్య పెరుగుతుంటే.. మనోళ్లే ఎందుకు చావాలి అనే చావుతెలివి తేటలు పుట్టాయి రష్యన్లకు. అంతే.. ఇండియా నుంచి అమాయకుల్ని అరువు తెచ్చుకుని.. వాళ్ల ప్రాణాలను పణంగా పెట్టి యుద్ధాన్ని షురూ చేస్తున్నారు. లేటెస్ట్‌గా సీబీఐ ఛేదించిన మానవ అక్రమ రవాణా నెట్‌వర్క్‌ చెబుతున్న కఠోర నిజం ఇదే మరి. రష్యాలో ఉద్యోగాలు అంటే పోలోమని పరుగెత్తకండి.. పారాహుషార్ అని హెచ్చరిస్తోంది కేంద్ర ప్రభుత్వం.

పాతబస్తీకి చెందిన మహ్మద్‌.. ఉద్యోగం కోసం రష్యాకెళ్లి, ఉక్రెయిన్‌ యుద్ధంలో చనిపోయి.. ఇప్పుడు శవపేటికలో తేలాడు. సెక్యూరిటీ హెల్పర్‌గా ఉద్యోగమిస్తామంటూ మనోళ్లకు అర్థం కాని అక్షరాల్లో రష్యన్ లాంగ్వేజ్‌లో అగ్రిమెంట్ రాసి.. అక్కడికెళ్లి యుద్ధభూమిలో ప్రవేశపెట్టడం వల్లే అహ్మద్‌ చనిపోయాడు.. ఇది పచ్చి నిజం.

పాతబస్తీ అహ్మద్ ఒక్కడే కాదు.. ఇటువంటి వందలమంది అమాయకులు.. నకిలీ ఏజెంట్ల బారిన పడి రష్యాకు ఎగుమతయ్యి.. బలవంతంగా సైన్యంలో చేరి.. కుటుంబాలకు దూరమై, నిండుప్రాణాల్ని బలి పెట్టుకుంటున్నారు. ఇదొక గ్లోబల్ ప్లేస్‌మెంట్ ఫ్రాడ్. అంతర్జాతీయ ఘరానాగాళ్లు పెద్ద నెట్‌వర్క్‌గా ఏర్పడి.. ఇండియా నుంచి యువకుల్ని పట్టుకెళ్తున్నారు.

మెరుగైన ఉద్యోగాలు, లక్షల్లో జీతాలు- మీ బిందాస్ లైఫ్‌కి మాదీ గ్యారంటీ అంటూ మాయమాటలతో మోసపుచ్చి నిరుద్యోగ యువకుల్ని వల్లో వేసుకోవడం ఈ రాకెట్‌లో మొదటి అడుగు. ఫీజుల్లో రాయితీ కల్పించి, నకిలీ యూనివర్సిటీల్లో అడ్మిషన్లు ఇప్పించి… ఏదోవిధంగా మాస్కో విమానం ఎక్కిస్తారు. రష్యాకు చేరగానే పాస్‌పోర్టులు లాక్కుని, మరో మార్గం లేకుండా చేసి వీళ్లందరినీ యుద్ధం వైపు మళ్లిస్తారు. ఇలావెళ్లిన వాళ్లలో ఇద్దరు చనిపోయారు. మరికొందరు గాయపడ్డారు. ఇప్పటిదాకా ఇటువంటివి 35 కేసులు నమోదయ్యాయి. ఇద్దరు మాయదారి ఏజెంట్లపై ఫోకస్ పెట్టిన సీబీఐ.. తీగ లాగితే డొంకంతా కదిలింది.

17 వీసా కన్సల్టెన్సీలు, వాటి ఓనర్లు, ఏజెంట్ల పేర్లు అన్నీ ఎఫ్‌ఐఆర్‌లో చేర్చి పూర్తి స్థాయి దర్యాప్తు మొదలుపెట్టింది. ఢిల్లీ, తిరుచ్చి, ముంబై, చండీఘర్, మదురై, చెన్నై ఇలా 13 నగరాల్లో తనిఖీలు చేసింది. త్వరలో దేశవ్యాప్తంగా మరిన్ని సోదాలు చేసి కూపీ లాగనుంది సీబీఐ.

ఈ ఘరానా నెట్‌వర్క్‌పై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. రష్యా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సంజాయిషీ కోరింది భారత విదేశాంగ శాఖ. మాస్కో మిలిటరీ అనే ట్యాగ్‌తో జరిగే ఔట్‌సోర్సింగ్ నియామకాలు జరిపితే.. కేర్‌ఫుల్‌గా ఉండాలని నిరుద్యోగుల్ని హెచ్చరిస్తోంది సీబీఐ. అదీ.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఇండియన్ల దీనగాధ.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..