దేశవ్యాప్తంగా నేరాభియోగాలు ఎదుర్కొంటున్న 363 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. నిరూపణ అయితే అనర్హత!

|

Aug 25, 2021 | 8:53 AM

దేశవ్యాప్తంగా 363 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు అనర్హత వేటు పడే అవకాశమున్న నేరాభియోగాలు ఎదుర్కొంటున్నారు. అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ -ఏడీఆర్‌ సంస్థ...

దేశవ్యాప్తంగా నేరాభియోగాలు ఎదుర్కొంటున్న 363 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. నిరూపణ అయితే అనర్హత!
Mp Mla Crimes
Follow us on

దేశవ్యాప్తంగా 363 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు అనర్హత వేటు పడే అవకాశమున్న నేరాభియోగాలు ఎదుర్కొంటున్నారు. అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ -ఏడీఆర్‌ సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. ఇందులో 296 మంది ఎమ్మెల్యేలు, 67 మంది ఎంపీలు ఉన్నారు. ఈ కేసులు నిరూపణ అయితే రిప్రజెంటేషన్‌ ఆఫ్‌ పీపుల్స్‌ చట్టంలోని 8వ సెక్షన్‌ కింద వీరిపై అనర్హత వేటు పడుతుందని ఏడీఆర్‌ పేర్కొంది. నేరాభియోగాలు నమోదైన వారిలో 39 మంది కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు ఉన్నారు. 2019 నుంచి 2021 కాలానికి 542 మంది లోక్‌సభ సభ్యులు, 1,953 మంది ఎమ్మెల్యేల అఫిడవిట్‌లను విశ్లేషించి ఈ వివరాలను ఏడీఆర్‌ బహిర్గతంచేసింది.

క్రిమినల్ ఛార్జెస్‌ ఎదుర్కొంటున్న వారిలో అత్యధికంగా 83 మంది బీజేపీ సభ్యులున్నారు. 47 మందితో కాంగ్రెస్ సెకండ్‌ప్లేస్‌లో ఉంటే , 25 మంది నేతలతో తృణమూల్‌ కాంగ్రెస్‌ థర్డ్‌ప్లేస్‌లో ఉంది..ఇక వైసీపీ నుంచి 22 మంది, బీజేడీకి చెందిన 22 మంది ప్రజాప్రతినిధులపై నేరాభియోగాలు నమోదయ్యాయి. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేల్లో 54 మంది, 2021 కేరళ ఎన్నికల్లో గెలిచిన వారిలో 42 మంది ఎమ్మెల్యేలు ఇదే తరహా అభియోగాలు ఎదుర్కొంటున్నారు. కేంద్రమంత్రుల్లో నలుగురు, వివిధ రాష్ట్రాల మంత్రుల్లోని 35 మందిపై క్రిమినల్ ఛార్జెస్ నమోదయ్యాయి. ఎంపీలపై నమోదైన కేసులు సగటున 7 ఏళ్లు, ఎమ్మెల్యేలపై నమోదైన కేసులు సగటున ఆరేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి.

వైసీపీ తరపున క్రిమినల్ ఛార్జెస్ ఎదుర్కొంటున్నవారిలో ఎంపీలు మిథున్‌రెడ్డి, మార్గాని భరత్‌, బెల్లాన చంద్రశేఖర్‌, ఎంవీవీ సత్యనారాయణ ఉన్నారు. 18 మంది ఎమ్మెల్యేలు కోలగట్ల వీరభద్రస్వామి, మేరుగ నాగార్జున, అన్నాబత్తుని శివకుమార్‌, బొల్లా బ్రహ్మనాయుడు, మేకపాటి గౌతంరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, పి.రవీంద్రనాథ్‌రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, బియ్యపు మధుసూదన్‌రెడ్డి, ఆరణి శ్రీనివాసులు, పాముల పుష్పశ్రీవాణి, కాపు రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకానాథ్‌రెడ్డి, జక్కంపూడి రాజా, బుర్రా మధుసూదనరావు, సామినేని ఉదయభాను, మేకతోటి సుచరిత ఉన్నారు. టీడీపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్‌ కుమార్‌, కరణం బలరామ కృష్ణమూర్తి ఉన్నారు. వీరు ప్రస్తుతం వైసీపీలో చేరారు. తెలంగాణ నుంచి ఇలాంటి అభియోగాలు ముగ్గురు ఎంపీలు ఎదుర్కొంటున్నారు. ఇందులో సోయం బాపూరావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మాలోతు కవిత ఉన్నారు.

ప్రజాప్రాతినిధ్యచట్టంలోని సెక్షన్‌ 8 కింద కేసులు ఎదుర్కొంటున్నవారికి శిక్షపడ్డ రోజు నుంచే అనర్హత మొదలవుతుంది. మళ్లీ వారు విడుదలైన రోజు నుంచి ఆరేళ్లపాటు ఆ అనర్హత కొనసాగుతుంది. ఈ సెక్షన్ల కింద ఉన్నవన్నీ తీవ్రమైన నేరాలే. అన్నీ భారతీయ నేర స్మృతి పరిధిలోకి వచ్చేవే. హత్య, అత్యాచారం, దోపిడీ, కిడ్నాపింగ్‌, మహిళలపై నేరాలు, లంచం, కులాలు, మతాలు, జాతి, భాష, ప్రాంతం ప్రాతిపదికన వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచడంలాంటి నేరాలు ఈ సెక్షన్ల పరిధిలో ఉంటాయి.

Also Read: టీవీ9 చేతిలో కోగంటి సత్యం రిమాండ్ రిపోర్ట్.. అందులోని కీలక విషయాలు ఇవే

 అమెరికాలో అత్యంత పొడవైన వ్యక్తిగా గిన్నిస్ రికార్డ్స్‌కి ఎక్కిన ఇగోర్ మృతి