దారుణం.. తల్లి కళ్లముందే గుండెపోటుతో యువ బాడీబిల్డర్‌ మృతి!

కర్ణాటకలో విషాద సంఘటన చోటుచేసుకుంది. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన యువ బాడీబిల్డర్ గుండె పోటుతో మృతి చెందాడు. జిమ్‌ నుంచి ఇంటికి వచ్చిన కొద్దిసేపటికే కుప్పకూలి బాడీ బిల్డర్‌ మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి కర్ణాటకలోని కేటీ జంబన్ననగర్‌లో జరిగింది.

దారుణం.. తల్లి కళ్లముందే గుండెపోటుతో యువ బాడీబిల్డర్‌ మృతి!
Bodybuilder Sushil Kumar

Updated on: Jun 18, 2026 | 12:10 PM

దావణగెరె, జూన్‌ 18: కర్ణాటకలోని కేటీ జంబన్ననగర్‌లో దారుణ సంఘటన జరిగింది. మృతుడిని 26 ఏళ్ల సుశీల్ కుమార్‌గా గుర్తించారు. కేటీజే నగర్‌కు చెందిన సుశీల్ కుమార్ రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక బాడీబిల్డింగ్‌ పోటీల్లో విజేతగా నిలిచి పలు అవార్డులు అందుకున్నారు. అంతర్జాతీయ స్థాయి బాడీబిల్డింగ్‌ పోటీల కోసం కూడా ఆయన సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో మంగళవారం రాత్రి సుమారు 8:30 గంటలకు జిమ్‌ వ్యాయామం ముగించుకుని ఇంటికి చేరుకున్న సుశీల్ కుమార్.. కొద్దిసేపటికే తల తిరుగుతోందని కుటుంబ సభ్యులకు చెప్పి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు అతడిని ఆసుపత్రికి తరలించగా.. మార్గం మధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు.

తక్కువ రక్తపోటు (లో బ్లడ్ ప్రెషర్) కారణంగా గుండెపోటు వచ్చి మృతి చెందినట్లు వైద్యులు భావిస్తున్నారు. అయితే ఖచ్చితమైన కారణాలు పోస్టుమార్టం నివేదిక అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది. సుశీల్ కుమార్ ఆకస్మిక మరణంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ప్రతిరోజూ డజన్ల సంఖ్యలో యువతకు శిక్షణ ఇస్తూ ఫిట్‌నెస్‌ రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందిన సుశీల్‌ కుమార్ మరణం స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. జిల్లా ఆసుపత్రిలో గ్రూప్-డి ఉద్యోగిగా పనిచేస్తున్న సుశీల్ కుమార్ తల్లి దేవమ్మ కుమారుడి మృతితో కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇక నాకు అండగా ఎవరు ఉంటారు? అంటూ ఆమె గుండెలు బాదుకుంటూ విలపించిన విధనం చూపరులను కంటతడి పెట్టించింది.

ఇవి కూడా చదవండి

ఇటీవలి కాలంలో ముఖ్యంగా జిమ్‌కు వెళ్లే యువతలో గుండెపోటు కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నిపుణులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. క్రమబద్ధమైన జీవనశైలి, సరైన ఆహారం, వైద్య పరీక్షలు, అధిక ఒత్తిడి లేకుండా వ్యాయామం చేయడం వంటి జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.

Follow Us