
స్నేహితులతో కలిసి సరదాగా వెళ్లిన విహారయాత్ర ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. మహారాష్ట్రలోని మాల్వన్ తాలూకా వైరీ గ్రామంలో ఉన్న ఓ రిసార్ట్లో స్విమ్మింగ్ పూల్లో జరిగిన ప్రమాదంలో 25 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. మృతుడిని సంగ్లీ జిల్లాకు చెందిన శ్రేణిక్ తకాలేగా గుర్తించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. శ్రేణిక్ తన స్నేహితులతో కలిసి రిసార్ట్కు వెళ్లాడు. ఈ క్రమంలో స్విమ్మింగ్ పూల్లోకి ఎత్తు నుంచి దూకాడు. అయితే తాను దూకిన ప్రాంతంలో నీటి లోతు చాలా తక్కువగా ఉందనే విషయాన్ని గుర్తించలేదు. దూకిన వెంటనే అతని తల స్విమ్మింగ్ పూల్ అడుగు భాగాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో తీవ్ర తలకు గాయమై అక్కడికక్కడే స్పృహ కోల్పోయాడు. గమనించిన స్నేహితులు వెంటనే అతడిని నీటిలో నుంచి బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.
సరదాగా గడపాలని వెళ్లిన విహారయాత్ర విషాదంగా మారడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. స్విమ్మింగ్ పూల్లలో కనీస భద్రతా నిబంధనలు పాటించడం ఎంత ముఖ్యమో ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది.