
లక్నో, సెప్టెంబర్ 15: ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్లోని గోడాపూర్ గ్రామంలోని బహగుల్ నది వంతెన సమీపంలో చెట్ల పొదల్లో ఆదివారం మధ్యాహ్నం 15 రోజుల ఆడ పసికందును సజీవంగా పాతిపెట్టారు. అటుగా వచ్చిన మేకలు మేపే కాపరికి ఓ బిడ్డ ఏడ్పు ఎక్కడి నుంచో వినిపించింది. నిశితంగా చూస్తే నేలపై మట్టిదిబ్బలో నుంచి ఓ లేత చేయి బయటకు వచ్చి కనిపించింది. చీమలు ముసురుకుని, రక్తమోడుతూ కనిపించిన ఆ చేయిని చూసి చలించిపోయి వెంటనే అతడు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. వారు అక్కడకు చేరుకుని కొన ఊపిరితో ఉన్న రోజుల పసికందును కాపాడారు. బిడ్డ ఊపిరి తీసుకోవడం గమనించి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం ప్రభుత్వ మెడికల్ కాలేజీ హాస్పిటల్కు తరలించారు.
ఐసీయూలో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నట్లు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేష్ కుమార్ తెలిపారు. పాప వయసు 10 నుంచి 15 రోజులు ఉంటుందని, చాలా బలహీనంగా ఉన్నట్లు తెలిపారు. చీమలు కుట్టడం వల్ల బిడ్డ ఒంటిపై గాయాలున్నాయని, విపరీతంగా రక్తస్రావం అయినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఊపిరి పీల్చుకోవడానికి అనుకూలంగా ఉండేందుకు ఉద్దేశ్య పూర్వకంగానే ఆడ బిడ్డను ఒక అడుగు లోతులో పాతిపెట్టి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. బాధ్యులను గుర్తించడానికి బహగుల్ నది రోడ్డు వెంబడి ఏర్పాటు చేసిన సిసిటివి కెమెరాల ఫుటేజ్లను పరిశీలిస్తున్నట్లు జైతిపూర్ పోలీస్ స్టేషన్ SHO గౌరవ్ త్యాగి తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.