
చలికాలం చలి గాలుల వల్ల మనకు దాహం తక్కువగా అనిపిస్తుంది. అయితే గర్భిణీ స్త్రీలు దాహం వేయడం లేదని నీరు త్రాగడం తగ్గిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరంలో నీటి శాతం తగ్గడం వల్ల కేవలం డీహైడ్రేషన్ మాత్రమే కాకుండా ప్రసవ సమయంలో సంక్లిష్టతలు ఏర్పడి సిజేరియన్ వరకు దారితీసే అవకాశం ఉంది.
ఢిల్లీలోని ఆర్ఎంఎల్ హాస్పిటల్ గైనకాలజీ విభాగాధిపతి డాక్టర్ సలోని చద్దా అభిప్రాయం ప్రకారం.. గర్భిణీలు రోజుకు కనీసం 8 నుండి 10 గ్లాసుల నీరు త్రాగాలి. గర్భంలో శిశువు చుట్టూ ఉండే ద్రవాన్ని అమ్నియోటిక్ ద్రవం అంటారు. ఇది శిశువుకు రక్షణ కవచంలా పనిచేస్తుంది. నీటి తీసుకోవడం తగ్గితే ఈ ద్రవం స్థాయిలు పడిపోతాయి. దీనివల్ల శిశువు కదలికలకు ఇబ్బంది కలగడమే కాకుండా ప్రసవ సమయంలో సమస్యలు తలెత్తి వైద్యులు సిజేరియన్ చేయాల్సి వస్తుంది.
యూరినరీ ఇన్ఫెక్షన్లు: నీరు తక్కువైతే గర్భిణీలలో మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది.
అమ్నియోటిక్ బ్యాండ్ సిండ్రోమ్: ద్రవం తక్కువగా ఉన్నప్పుడు శిశువు చేతులు, కాళ్లు లేదా ముఖంపై ఒత్తిడి పడి శారీరక ఇబ్బందులు కలగవచ్చు.
అకాల ప్రసవం: శరీరంలో నీరు తగ్గడం వల్ల నెలలు నిండకముందే ప్రసవం అయ్యే ప్రమాదం ఉంది.
మీ శరీరంలో నీటి శాతం తగ్గిందని చెప్పడానికి ఈ క్రింది లక్షణాలు సంకేతాలు..
మూత్రం ముదురు పసుపు రంగులో రావడం.
పెదవులు, చర్మం తరచుగా ఎండిపోవడం.
విపరీతమైన అలసట, తలనొప్పి.
గర్భధారణ సమయంలో చిన్న పొరపాటు కూడా పెద్ద నష్టానికి దారితీయవచ్చు. అందుకే చలికాలం కదా అని నిర్లక్ష్యం చేయకుండా, సమయానికి నీరు తాగుతూ మిమ్మల్ని, మీ బిడ్డను ఆరోగ్యంగా ఉంచుకోండి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..