
భోజనం చేసిన తర్వాత కాసేపు నడవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చాలా మంది నమ్ముతారు. అయితే, తిన్న వెంటనే వేగంగా నడవడం లేదా పరుగెత్తడం అస్సలు మంచిది కాదు. అందుకే నిపుణుల అభిప్రాయం ప్రకారం, భోజనం చేసిన తర్వాత ఎంత సేపటికి నడవాలి..? ఆ నియమాలేంటో ఇప్పుడు చూద్దాం..
మనం ఆహారం తీసుకోగానే, ఆ ఆహారాన్ని అరిగించడానికి మన శరీరం ఎక్కువ రక్తాన్ని కడుపు, ప్రేగుల వైపు మళ్లిస్తుంది. ఒకవేళ మీరు భోజనం ముగించిన వెంటనే వేగంగా నడవడం లేదా భారీ వ్యాయామాలు (Heavy Workouts) చేయడం ప్రారంభిస్తే, ఆ రక్త ప్రవాహం కాళ్ల కండరాల వైపు మళ్లుతుంది. దీనివల్ల జీర్ణక్రియ ప్రక్రియ నెమ్మదిస్తుంది. కడుపులో గ్యాస్, ఉబ్బరం, కడుపునొప్పి వంటి జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. కొందరిలో వికారం లేదా అసౌకర్యం కలగవచ్చు.
నిపుణుల ప్రకారం, భోజనం ముగిసిన వెంటనే సోఫాలో కూర్చోవడం లేదా పడుకోవడం ఎంత తప్పో, వెంటనే స్పీడ్గా నడవడం కూడా అంతే తప్పు. భోజనం చేసిన 10 నుండి 15 నిమిషాల తర్వాత కేవలం 10-15 నిమిషాల పాటు చాలా సాధారణ వేగంతో (Casual Pace) నడవడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. అవేంటంటే..
బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది: భోజనం చేసిన తర్వాత రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు (Sugar Spikes) ఒక్కసారిగా పెరుగుతాయి. తిన్న కొద్దిసేపటికి నడవడం వల్ల కండరాలు ఆ గ్లూకోజ్ను శక్తిగా మార్చుకుంటాయి. ఇది ముఖ్యంగా డయాబెటిస్, ప్రీ-డయాబెటిస్ ఉన్నవారికి చాలా మేలు చేస్తుంది.
బొడ్డు చుట్టూ కొవ్వు (Belly Fat) తగ్గుతుంది: భోజనం తర్వాత నడవడం వల్ల మెటబాలిజం (జీవక్రియ) చురుగ్గా మారి, తిన్న ఆహారం కొవ్వుగా మారకుండా శక్తిగా మారుతుంది.
మెరుగైన జీర్ణక్రియ: తేలికపాటి నడక వల్ల కడుపులోని కండరాలు కదిలి, ఆహారం త్వరగా, సులభంగా జీర్ణమవడానికి సహాయపడుతుంది.
భోజనం తర్వాత నడిచేటప్పుడు తీవ్రత (Intensity) కంటే స్థిరత్వం (Consistency) ముఖ్యం. ఎప్పుడూ ఫ్లాట్ సర్ఫేస్ (సమతలంగా ఉన్న చోటు) లేదా ఇంట్లోనే హాల్లోనే నిదానంగా పచార్లు చేయడం మంచిది. నడిచేటప్పుడు ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తే వెంటనే ఆగిపోవాలి. ఏదైనా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తమ వైద్యుల సలహా తీసుకోవడం శ్రేయస్కరం.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..