
పాతబడిపోయిన ఆర్టీసీ బస్సులను పారేయకుండా, వాటిని అధునాతన ఏసీ డార్మిటరీలుగా మార్చి కేఎస్ఆర్టీసీ సరికొత్త విప్లవానికి తెరలేపింది. రైలులోని స్లీపర్ క్లాస్ మాదిరిగానే ఉండే ఈ బస్సులలో చార్జింగ్ పాయింట్లు, ఆహారం తీసుకోవడానికి ప్రత్యేక స్థలం వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి. 2020లో ప్రారంభమైన ఈ సేవలకు పర్యాటకుల నుండి విశేష స్పందన లభిస్తోంది. కేవలం వసతి మాత్రమే కాదు, మున్నార్లోని పర్యాటక ప్రదేశాలను చూడటానికి కేఎస్ఆర్టీసీ డబుల్ డెక్కర్ బస్సు సేవలను కూడా అందిస్తోంది. ఈ బడ్జెట్ బసకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
KSRTC బడ్జెట్ బస ప్రత్యేకతలు:
ధరల వివరాలు: ఒక బెడ్కు కేవలం రూ. 160, దుప్పటి కోసం రూ. 60.. మొత్తం కలిపి రూ. 220 మాత్రమే.
వసతి సామర్థ్యం: ఒక బస్సులో 16 మంది వరకు బస చేయవచ్చు. అలాగే ఎనిమిది మంది ఉండే చిన్న డార్మిటరీలు కూడా అందుబాటులో ఉన్నాయి.
సమయాలు: చెక్-ఇన్ సాయంత్రం 5.30 గంటలకు, చెక్-అవుట్ మరుసటి రోజు ఉదయం 9.30 గంటలకు ఉంటుంది.
అదనపు సౌకర్యాలు: ఏసీ గదులతో పాటు మొబైల్ చార్జింగ్ పాయింట్లు ఉన్నాయి. టాయిలెట్ సౌకర్యం బస్సు బయట డిపో లోపల ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడింది.
లోకేషన్: ఈ సౌకర్యం మున్నార్ కేఎస్ఆర్టీసీ డిపోలోనే అందుబాటులో ఉంటుంది. ఇది పర్యాటక ప్రదేశాలకు చేరువగా ఉండటం మరో ప్లస్ పాయింట్.
బుకింగ్ ఎలా చేసుకోవాలి?
ఈ వసతి సౌకర్యానికి ఆన్లైన్ బుకింగ్ అందుబాటులో లేదు. పర్యాటకులు నేరుగా మున్నార్ కేఎస్ఆర్టీసీ డిపోకు వెళ్లి అక్కడ బెడ్ను బుక్ చేసుకోవాలి. మీరు వెళ్లేముందు డిపోకు కాల్ చేసి ఖాళీలు ఉన్నాయో లేదో సరిచూసుకోవడం మంచిది.