IRCTC Tour: ఐఆర్సీటీసీ తీపికబురు.. ఒకే ప్యాకేజీలో పద్మనాభ స్వామి టు మధుర మీనాక్షి దర్శనాలు

దక్షిణ భారతంలోని పుణ్యక్షేత్రాలను, అద్భుత పర్యాటక ప్రాంతాలను సందర్శించాలనుకునే వారికి శుభవార్త! ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) తాజాగా ఓ సరికొత్త టూర్ ప్యాకేజీని ప్రకటించింది. "సౌత్ ఇండియా టెంపుల్ రన్" పేరుతో అందిస్తున్న ఈ ప్రత్యేక ప్యాకేజీ ద్వారా కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని ప్రసిద్ధ దేవాలయాలను, పర్యాటక ప్రదేశాలను ఒకేసారి చూసే అవకాశం కలుగుతుంది. అందుబాటు ధరలోనే లభించే ఈ టూర్ హైదరాబాద్‌ నుంచి విమాన ప్రయాణంతో ప్రారంభం కానుంది.

IRCTC Tour: ఐఆర్సీటీసీ తీపికబురు.. ఒకే ప్యాకేజీలో పద్మనాభ స్వామి టు మధుర మీనాక్షి దర్శనాలు
Irctc Temple Run Tour

Updated on: Jun 25, 2025 | 9:00 PM

ఐఆర్​సీటీసీ రూపొందించిన ఈ ప్యాకేజీ మొత్తం 6 రాత్రులు, 7 పగళ్లు కొనసాగనుంది. ఈ టూర్‌లో కన్యాకుమారి, మధురై, రామేశ్వరం, తిరుచ్చి, త్రివేండ్రంలోని ప్రముఖ దేవాలయాలు, పర్యాటక ప్రదేశాలను సందర్శించవచ్చు. ప్రస్తుతం ఈ ప్యాకేజీ 2025 జులై 7వ తేదీన అందుబాటులో ఉంది. పూర్తి వివరాలు, బుకింగ్ కోసం ఐఆర్​సీటీసీ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. ఈ టూర్ దక్షిణ భారతదేశంలోని అద్భుతాలను ఆస్వాదించాలనుకునేవారికి ఇదో గొప్ప అవకాశం.

మీ ప్రయాణ మార్గం ఇలా ఉండనుంది:

మొదటి రోజు: ఉదయం 6 గంటలకు హైదరాబాద్‌ విమానాశ్రయం నుంచి విమానంలో బయలుదేరి, 8 గంటలకు తిరువనంతపురం చేరుకుంటారు. హోటల్‌లో చెక్ ఇన్, అల్పాహారం అనంతరం అజిమాలా శివాలయం, బీచ్‌ను సందర్శిస్తారు. సాయంత్రం అనంత పద్మనాభ స్వామి దేవాలయాన్ని దర్శించుకుని, కోవలంలో రాత్రి బస చేస్తారు.

రెండో రోజు: ఉదయం అల్పాహారం తర్వాత కన్యాకుమారికి బయలుదేరుతారు. మార్గమధ్యంలో చారిత్రక పద్మనాభపురం ప్యాలెస్‌ను సందర్శిస్తారు. మధ్యాహ్నానికి కన్యాకుమారి చేరుకుని, హోటల్‌లో చెక్ ఇన్ అవుతారు. సాయంత్రం సూర్యాస్తమయాన్ని వీక్షించి, రాత్రి అక్కడే బస చేస్తారు.

మూడో రోజు: అల్పాహారం చేశాక రాక్ మెమోరియల్‌ను సందర్శించి, రామేశ్వరం బయలుదేరుతారు. హోటల్‌లో చెక్ ఇన్ చేసుకుని రాత్రి అక్కడే బస చేస్తారు.

నాలుగో రోజు: అల్పాహారం అనంతరం రామేశ్వరం, ధనుష్కోడిలోని స్థానిక ఆలయాలను దర్శించుకుంటారు. ఆ రాత్రికి అక్కడే బస.

ఐదో రోజు: టిఫిన్ తర్వాత హోటల్ నుంచి చెక్ అవుట్ చేసి, దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం మెమోరియల్‌ను సందర్శించి, తంజావూరుకు బయలుదేరుతారు. అక్కడ బృహదీశ్వర ఆలయాన్ని దర్శించుకుని తిరుచ్చికి పయనమవుతారు. ఆ రాత్రికి అక్కడే భోజనం, బస.

ఆరో రోజు: బ్రేక్‌ఫాస్ట్ అనంతరం శ్రీరంగం రంగనాథ దేవాలయాన్ని దర్శించుకుంటారు. ఆ తర్వాత మదురై బయలుదేరి, సాయంత్రానికి చేరుకుని హోటల్‌లో చెక్ ఇన్ అవుతారు. సాయంత్రం మీనాక్షి అమ్మవారిని దర్శించుకుంటారు. రాత్రికి మదురైలోనే బస చేయాలి.

ఏడో రోజు: ఉదయం టిఫిన్ చేశాక హోటల్ నుంచి చెక్ అవుట్ ఉంటుంది. అక్కడి నుంచి మదురై ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం. రాత్రి 7 గంటలకు భాగ్యనగరానికి చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.

ప్యాకేజీ ధరలు.. ఇవే!

ఈ అద్భుతమైన ప్యాకేజీ ధరలు ఇలా ఉన్నాయి:

ఒకరికి (సింగిల్ ఆక్యుపెన్సీ): రూ. 51,500

ఇద్దరికి (డబుల్ షేరింగ్): రూ. 37,700 చొప్పున

ముగ్గురికి (ట్రిపుల్ ఆక్యుపెన్సీ): రూ. 35,650 చొప్పున

5 నుంచి 11 ఏళ్ల లోపు చిన్నారులకు (విత్‌ బెడ్): రూ. 30,900

5 నుంచి 11 ఏళ్ల లోపు చిన్నారులకు (వితౌట్‌ బెడ్): రూ. 25,550

2 నుంచి 4 ఏళ్ల లోపు చిన్నారులకు (వితౌట్ బెడ్): రూ. 18,250

ప్యాకేజీలో ఏమేం ఉంటాయి?

ఫ్లైట్ టికెట్లు: హైదరాబాద్‌-తిరువనంతపురం, మదురై-హైదరాబాద్‌ విమాన టికెట్లు.

వసతి: 6 రోజుల పాటు హోటల్ వసతి.

భోజనం: 7 రోజుల పాటు అల్పాహారం (బ్రేక్‌ఫాస్ట్), 4 రోజుల పాటు డిన్నర్ (రాత్రి భోజనం). (మధ్యాహ్న భోజనం ప్రయాణికులే ఏర్పాటు చేసుకోవాలి).

రవాణా: పర్యాటక ప్రదేశాల సందర్శనకు ప్యాకేజీని బట్టి బస్సు సౌకర్యం.

బీమా: ప్రయాణ బీమా సదుపాయం ఉంటుంది.