
మనం ఏం తింటున్నామనేది మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. కేవలం కూరలు, పప్పులు మార్చడమే కాకుండా, మనం తినే పిండిని (Flour) మార్చడం ద్వారా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని రకుల్ ప్రీత్ సింగ్ నిరూపిస్తున్నారు. గోధుమల్లో ఉండే గ్లూటెన్ సమస్యలు లేకుండా, కేవలం జొన్న రొట్టెలు, రాగి ముద్దలు తినడం వల్ల కలిగే లాభాలను వైద్య నిపుణులు కూడా సమర్థిస్తున్నారు. పదేళ్ల పాటు ఆమె అనుసరిస్తున్న ఈ హెల్తీ డైట్ ప్లాన్ వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే…
బాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ తన ఫిట్నెస్ ప్రయాణంలో ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. పదేళ్లుగా ఆమె తన ఇంట్లో గోధుమ పిండికి బదులుగా జొన్న (Jowar), రాగి (Ragi) పిండిని మాత్రమే వాడుతున్నారు.
గ్లూటెన్ రహితం: జొన్నలు, రాగులు సహజంగానే గ్లూటెన్ లేని ధాన్యాలు. ఇవి జీర్ణక్రియను సులభతరం చేస్తాయి. ముఖ్యంగా గ్లూటెన్ పడని వారికి ఇవి గొప్ప ప్రత్యామ్నాయం.
ప్రేగుల ఆరోగ్యం: ఇందులో ఉండే పీచు పదార్థం (Fibre) కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది.. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.. చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. దీనివల్ల ఊబకాయం, మధుమేహం వచ్చే ముప్పు తగ్గుతుంది.
పోషకాల గని: రాగులలో పాలుకు సమానమైన కాల్షియం ఉంటుంది. ఇది ఎముకల బలానికి ఎంతో అవసరం. అలాగే జొన్నలలో ఉండే రాగి (Copper), ఐరన్ వంటి ఖనిజాలు రక్తహీనతను తగ్గిస్తాయి.
వృద్ధాప్యాన్ని అడ్డుకుంటుంది: వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతంగా మార్చడమే కాకుండా, కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడి వయస్సు పెరుగుతున్నా యవ్వనంగా కనిపించేలా చేస్తాయి.
రకుల్ మాటల్లో: “మీరు తినే పప్పు, కూరలు, చికెన్ అన్నీ అలాగే ఉంటాయి.. కానీ మీరు వాడే పిండిని మార్చండి. మీ శరీరంలో వచ్చే మార్పును మీరే గమనిస్తారు. ఇంటి వద్ద ఉన్నప్పుడు తెలివైన ఆహారపు ఎంపికలు చేసుకోవడం వల్ల దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయి” అని ఆమె పేర్కొన్నారు.
గమనిక: ఈ సమాచారం ప్రముఖ సెలబ్రిటీల అనుభవాలు, పోషకాహార నిపుణుల విశ్లేషణల ఆధారంగా రూపొందించబడింది. ప్రతి ఒక్కరి శరీర తత్వం వేరుగా ఉంటుంది, కాబట్టి మీ ఆహారంలో పెద్ద మార్పులు చేసే ముందు మీ వ్యక్తిగత వైద్యుడిని సంప్రదించడం మంచిది.