
భారత బ్యాడ్మింటన్ దిగ్గజం పీవీ సింధు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక ఫోటో ఇప్పుడు క్రీడాకారుల్లోనూ, ఫిట్నెస్ ప్రియుల్లోనూ చర్చకు దారితీసింది. రెండు గంటల వ్యవధిలో రెండు మ్యాచ్లు ఆడి గెలిచిన తర్వాత.. మోకాళ్లకు, భుజాలకు ఐస్ ప్యాక్లు కట్టుకుని కుర్చీలో కూర్చున్న ఫోటోను ఆమె పోస్ట్ చేశారు. “నా శరీరం నాకు మర్యాదగా గుర్తు చేస్తోంది.. నాకిప్పుడు 19 ఏళ్లు కావని” అంటూ ఆమె పెట్టిన క్యాప్షన్ వయసు పెరిగే కొద్దీ రికవరీ ప్రక్రియలో వచ్చే మార్పులను స్పష్టం చేస్తోంది.
30 ఏళ్లు దాటిన వారు తమ సామర్థ్యానికి మించి శ్రమించినప్పుడు రక్తపోటు పెరిగి మెదడులో రక్తస్రావం జరిగే ప్రమాదం ఉంది. ముఖ్యంగా అధిక బరువు ఉన్నవారు ఒక్కసారిగా తీవ్రమైన వ్యాయామాలు మొదలుపెడితే కార్డియాక్ అరెస్ట్ లేదా టెండన్ టియర్ (కండరాల చిరుగుదల) అయ్యే అవకాశం ఉంది.
వైద్య నిపుణుల సూచన ప్రకారం.. 30 ఏళ్లు పైబడిన వారు ఐసోమెట్రిక్ వ్యాయామాలకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది.
గాయాల నుండి కోలుకునే క్రమంలో మొండిగా ముందుకు వెళ్లడం కంటే, రీహాబ్ నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం. నొప్పి తగ్గడం, కీళ్ల కదలికలు సులభతరం కావడం, కదలికల్లో ఆత్మవిశ్వాసం పెరగడం వంటివి శరీరం కోలుకుంటున్నదనడానికి సంకేతాలు. ప్రతి వ్యక్తి శరీరం భిన్నంగా స్పందిస్తుంది కాబట్టి, ఇతరులతో పోల్చుకోకుండా మీ శరీర అవసరాలకు అనుగుణంగా వ్యాయామ పద్ధతులను మార్చుకోవాలి. గుర్తుంచుకోండి.. ఫిట్నెస్ అంటే కేవలం బరువులు ఎత్తడం కాదు, గాయాలు కాకుండా శరీరాన్ని దృఢంగా ఉంచుకోవడం.