
భారత్లో అడవి జంతువులను చూడాలంటే సాధారణంగా పచ్చని అడవులు, జాతీయ పార్కులు, టైగర్ రిజర్వ్లకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ, లడఖ్లో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నం. ఎత్తైన పర్వతాలు, మంచుతో కప్పబడిన లోయలు, రాతి కొండలు, విస్తారమైన నీలి ఆకాశం మధ్య అత్యంత అరుదైన మంచు చిరుతను గుర్తించడం అంత సులభం కాదు. రాళ్ల మధ్య కలిసిపోయే దాని శరీర రంగు కారణంగా శిక్షణ పొందిన కంటికి కూడా అది కనిపించకుండా పోతుంది. అందుకే దీనిని ‘పర్వతాల దెయ్యం’ (Ghost of the Mountains) అని పిలుస్తారు. ఇప్పుడు ఈ అరుదైన వన్యప్రాణిని కేంద్రంగా చేసుకుని లడఖ్లో సరికొత్త వైల్డ్లైఫ్ టూరిజం అనుభవానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. దేశంలోనే తొలి హై ఆల్టిట్యూడ్ వైల్డ్లైఫ్ సఫారీని ప్రారంభించేందుకు లడఖ్ పరిపాలన ఆమోదం తెలిపింది.
ఆగస్టు 6న లడఖ్ పరిపాలన ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. సాధారణంగా కజిరంగా, రణతంభోర్ వంటి వన్యప్రాణి ప్రాంతాల్లో నిర్వహించే జీప్ సఫారీల తరహాలో లడఖ్లో కూడా గైడెడ్ జీప్ సఫారీలను ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే లడఖ్లోని భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యేకంగా రూపొందించిన ఓపెన్-బ్యాక్ వాహనాలను ఉపయోగించనున్నారు. శిక్షణ పొందిన స్థానిక డ్రైవర్లు ఈ వాహనాలను నడపడంతో పాటు, నిపుణులైన గైడ్లు పర్యాటకులకు వన్యప్రాణుల గురించి వివరించనున్నారు.
ఈ సఫారీ పరిధిలో నుబ్రా, జాన్స్కర్, షామ్, కార్గిల్, ద్రాస్ ప్రాంతాలను చేర్చే అవకాశం ఉంది. అలాగే హేమిస్ నేషనల్ పార్క్, చాంగ్థాంగ్ వైల్డ్లైఫ్ శాంక్చువరీ, కరకోరం (నుబ్రా-ష్యోక్) వైల్డ్లైఫ్ శాంక్చువరీ ప్రాంతాల్లో కూడా అనువైన సఫారీ మార్గాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు.
లడఖ్లో ఈ సఫారీకి మంచు చిరుత ప్రధాన ఆకర్షణగా నిలవడానికి బలమైన కారణమే ఉంది. 2019 నుంచి 2023 వరకు దేశవ్యాప్తంగా నిర్వహించిన తొలి శాస్త్రీయ స్నో లెపార్డ్ పాపులేషన్ అసెస్మెంట్ ప్రకారం.. భారత్లో మొత్తం 718 మంచు చిరుతలు ఉన్నట్లు అంచనా వేశారు. వీటిలో ఏకంగా 477 మంచు చిరుతలు లడఖ్లోనే ఉన్నట్లు గుర్తించారు. దేశంలోని ఏ రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతంతో పోల్చినా ఇదే అత్యధిక సంఖ్య.
వైల్డ్లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నిర్వహించిన అధ్యయనంలో లడఖ్లో కెమెరా ట్రాప్ల ద్వారా 126 మంచు చిరుతలను గుర్తించారు. మొత్తం మీద ఈ ప్రాంతంలో వాటి సంఖ్య సుమారు 477గా అంచనా వేశారు. అందువల్ల అడవిలో మంచు చిరుతలను వీక్షించాలనుకునే వారికి లడఖ్ భారతదేశంలోనే అత్యంత ముఖ్యమైన ప్రాంతాల్లో ఒకటిగా నిలుస్తోంది.
శాస్త్రీయంగా Panthera unciaగా పిలిచే మంచు చిరుతను ఐయూసీఎన్ రెడ్ లిస్ట్లో ‘వల్నరబుల్’గా గుర్తించారు. నివాస ప్రాంతాల నాశనం, ఆహార జంతువుల సంఖ్య తగ్గడం, మనిషి-వన్యప్రాణి ఘర్షణలు, అక్రమ వేట, వాతావరణ మార్పులు వంటి కారణాలు ఈ జంతువుల మనుగడకు సవాళ్లుగా మారుతున్నాయి.
ఈ సఫారీ ప్రాజెక్టులో మరో ముఖ్యమైన అంశం స్థానిక ప్రజల భాగస్వామ్యం. లడఖ్ పరిపాలన ప్రకారం 20 మంది స్థానిక యువతను ఎంపిక చేసి శిక్షణ ఇవ్వనున్నారు. వీరికి పక్షుల పరిశీలన, పక్షుల గుర్తింపు, వన్యప్రాణులను గుర్తించడం వంటి అంశాల్లో శిక్షణ ఇవ్వడంతో పాటు అవసరమైన పరికరాలను కూడా అందించనున్నారు. వన్యప్రాణి సంరక్షణతో స్థానిక ప్రజల జీవనోపాధిని అనుసంధానం చేయడమే దీని ప్రధాన ఉద్దేశం. పర్యాటకులకు మార్గదర్శకులుగా పనిచేస్తూ స్థానిక యువత ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. అదే సమయంలో వన్యప్రాణుల సంరక్షణపై వారికి మరింత ఆసక్తి పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.
ఇదే లక్ష్యంతో జూన్లో లడఖ్ పరిపాలన Snow Leopard and High-Altitude Nature (SHAN) Conservation Society ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. వన్యప్రాణుల సంరక్షణ, శాస్త్రీయ నిర్వహణ, స్థానిక సమాజాల భాగస్వామ్యం, పర్యావరణ అనుకూల పర్యాటకం, స్థిరమైన జీవనోపాధి అవకాశాలను ప్రోత్సహించడం ఈ సంస్థ ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి.
ఇప్పటివరకు లడఖ్ అంటే ప్రధానంగా మంచు పర్వతాలు, మఠాలు, సరస్సులు, ఎత్తైన పర్వత మార్గాలు, అడ్వెంచర్ టూరిజానికి ప్రసిద్ధి. ఈ కొత్త సఫారీ అందుబాటులోకి వస్తే లడఖ్కు మరో ప్రత్యేక గుర్తింపు లభించే అవకాశం ఉంది. దేశంలోనే ప్రముఖ హై ఆల్టిట్యూడ్ వైల్డ్లైఫ్ డెస్టినేషన్గా లడఖ్ను నిలబెట్టేందుకు ఈ ప్రాజెక్టు కీలకంగా మారవచ్చు.