
ప్రస్తుత కాలంలో ప్రపంచవ్యాప్తంగా వయసుతో సంబంధం లేకుండా మిలియన్ల మందిని వేధిస్తున్న అతిపెద్ద ఆరోగ్య సమస్య షుగర్. ఒక్కసారి ఈ వ్యాధి బారిన పడితే జీవితాంతం ఆహార నియమాలు పాటించక తప్పదు. అయితే బ్లడ్ షుగర్ లెవెల్స్ను అదుపులో ఉంచుకోవడానికి ప్రకృతి మనకు ప్రసాదించిన అద్భుతమైన పండ్లలో నేరేడు పండు మొదటి వరుసలో ఉంటుంది. ముదురు ఊదా రంగులో, తీపి, వగరు కలగలిసిన ప్రత్యేకమైన రుచితో ఉండే ఈ పండులో డయాబెటిస్ను నియంత్రించే బోలెడన్ని పోషకాలు దాగి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
నేరేడు పండ్లలో ఉండే కొన్ని రకాల సహజ రసాయన సమ్మేళనాలు శరీరంలో చక్కెర శోషణ వేగాన్ని తగ్గిస్తాయి. దీనివల్ల మనం ఆహారం తిన్న తర్వాత రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఒక్కసారిగా పెరిగిపోకుండా అదుపులో ఉంటాయి. అంతేకాకుండా ఇది శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని, దాని పనితీరును మెరుగుపరచడంలో అద్భుతంగా సహాయపడుతుంది. అందుకే మధుమేహ బాధితులు తమ డైట్ ప్లాన్లో నేరేడు పండ్లను మితంగా చేర్చుకోవడం చాలా మంచిది.
నేరేడు పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఇవి శరీరంలో ఏర్పడే ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి, కణాలను దెబ్బతినకుండా రక్షిస్తాయి. సాధారణంగా డయాబెటిస్ ఉన్నవారికి భవిష్యత్తులో గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. నేరేడు పండ్లలోని యాంటీ ఆక్సిడెంట్లు ఆయా అవయవాల చుట్టూ రక్షణ కవచంలా పనిచేసి, కాంప్లికేషన్స్ రాకుండా చూస్తాయి.
నార్మల్ పండ్లతో పోలిస్తే నేరేడు పండ్లలో పీచుపదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను చురుగ్గా మార్చడమే కాకుండా తిన్న తర్వాత ఎక్కువ సేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. దీనివల్ల పదే పదే ఆకలి వేయడం తగ్గుతుంది. మధుమేహాన్ని అదుపులో ఉంచడానికి శరీర బరువును కంట్రోల్లో ఉంచుకోవడం చాలా ముఖ్యం కాబట్టి ఈ పండు బరువు తగ్గడానికి కూడా పరోక్షంగా ఎంతో హెల్ప్ అవుతుంది.
నేరేడు పండు డయాబెటిస్కు ఎంతో మేలు చేసినప్పటికీ.. దీనిని కేవలం ఒక ఆరోగ్యకరమైన ఆహారంగానే చూడాలి తప్ప, డాక్టర్లు ఇచ్చిన మందులకు ప్రత్యామ్నాయంగా భావించకూడదు. ప్రతి ఒక్కరి శరీర తత్వం వేరుగా ఉంటుంది కాబట్టి ఇప్పటికే డయాబెటిస్ మందులు వాడుతున్న వారు తమ వైద్యుల లేదా డైటీషియన్ల సలహా మేరకు సరైన మోతాదులో దీనిని తీసుకోవడం మంచిది. క్రమం తప్పకుండా వ్యాయామం, సరైన జీవనశైలితో పాటు నేరేడు పండును తింటే షుగర్ వ్యాధికి సులభంగా చెక్ పెట్టవచ్చు.