
ఆహారంలో ఉప్పు అనగానే మనందరికీ గుర్తొచ్చేది అధిక రక్తపోటు. గుండె ఆరోగ్యం కోసం ఉప్పును పూర్తిగా మానేయాలని లేదా చాలా తగ్గించాలని డాక్టర్లు చెబుతుంటారు. అయితే ఉప్పు విషయంలో మనం పాటిస్తున్నది ఒక గుడ్డి నమ్మకం మాత్రమేనని అంటున్నారు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ డిమిత్రి యారనోవ్. “ఉప్పు శరీరానికి శత్రువు కాదు కానీ అది ఎవరికి ప్రమాదకరమో తెలుసుకోవడమే ముఖ్యం అని ఆయన స్పష్టం చేశారు.
ఉప్పులోని సోడియం కేవలం రుచి కోసం మాత్రమే కాదు. మన శరీరంలోని కీలక వ్యవస్థలు పనిచేయడానికి ఇది చాలా అవసరం.
అందరూ ఉప్పు తగ్గించాల్సిన అవసరం లేదు, కానీ ఈ క్రింది 5 రకాల సమస్యలు ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త పడాలి. వీరి విషయంలో ఉప్పు మనుగడను ప్రభావితం చేస్తుంది:
హార్ట్ ఫెయిల్యూర్: వీరిలో ఉప్పు వల్ల శరీరంలో నీరు చేరి శ్వాస ఆడకపోవడం, తరచుగా ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి వస్తుంది.
అదుపులేని రక్తపోటు: మూడు నాలుగు రకాల మందులు వాడుతున్నా బిపి తగ్గని వారికి ఉప్పు చాలా హానికరం.
కిడ్నీ వ్యాధులు: సోడియం పెరిగితే కిడ్నీల పనితీరు మరింత మందగిస్తుంది.
లివర్ సిర్రోసిస్: కాలేయ సమస్యలు ఉన్నవారిలో ఉప్పు వల్ల కడుపులో నీరు చేరుతుంది.
వృద్ధులు: వయసు పెరిగే కొద్దీ రక్తనాళాలు సోడియంను తట్టుకునే శక్తిని కోల్పోతాయి.
ఆరోగ్యంగా ఉండి, క్రమం తప్పకుండా వ్యాయామం చేసే యువత లేదా ఎటువంటి ఇతర జబ్బులు లేని వారు ఉప్పుకు భయపడాల్సిన పనిలేదని డాక్టర్ యారనోవ్ వివరించారు. ప్రతి అధిక రక్తపోటుకు ఉప్పునే నిందించలేమని, అది సందర్భాన్ని బట్టి మారుతుందని ఆయన తెలిపారు.
వైద్యం అంటే ఆహారాన్ని విలన్గా చూపించడం కాదు.. ఎవరికి ఏది అవసరమో గుర్తించడం. మీకు తీవ్రమైన అనారోగ్య సమస్యలు లేకపోతే మితంగా ఉప్పు తీసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..