50 ఏళ్ల వయసులో బైక్‌తో సాహసం.. చరిత్ర సృష్టంచిన తెలంగాణ మహిళా డాక్టర్.. !

50 ఏళ్ల వయసులో తెలంగాణకు చెందిన డాక్టర్ మంజుల లేహ్-లడఖ్ బైక్ యాత్రను విజయవంతంగా పూర్తి చేసి చరిత్ర సృష్టించారు. బాల్య కలను సాకారం చేసుకుంటూ, అత్యంత క్లిష్టమైన పర్వత మార్గాలను అధిగమించారు. బంగీ జంప్ కూడా చేసి, ధైర్యసాహసాలను చాటారు. ఈ ఘనత సాధించిన తొలి తెలంగాణ/ఆంధ్రప్రదేశ్ మహిళగా రికార్డు సృష్టించి, వయసు కేవలం ఓ అంకె మాత్రమే అని నిరూపించారు. ఆమె మహిళా సాధికారతకు ఆదర్శంగా నిలిచారు.

50 ఏళ్ల వయసులో బైక్‌తో సాహసం.. చరిత్ర సృష్టంచిన తెలంగాణ మహిళా డాక్టర్.. !
Telangana Doctor Historic Bike Ride

Edited By:

Updated on: Aug 23, 2026 | 8:13 AM

వయసు పెరిగే కొద్దీ చాలామంది తమ కలలను పక్కన పెట్టేస్తారు. కానీ ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన డాక్టర్ మంజుల మాత్రం అందుకు భిన్నంగా నిలిచారు. చిన్ననాటి నుంచి బైక్‌పై లేహ్-లడఖ్ వెళ్లాలన్న తన కలను 50 ఏళ్ల వయసులో సాకారం చేసుకున్నారు. అత్యంత క్లిష్టమైన పర్వత మార్గాల్లో బైక్‌పై ప్రయాణించి లేహ్-లడఖ్ యాత్రను విజయవంతంగా పూర్తి చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ మార్గంలో బైక్‌పై ప్రయాణించిన తొలి మహిళగా ఆమె ఘనత సాధించారు.

చిన్ననాటి నుంచే బైక్‌పై లేహ్-లడఖ్‌కు వెళ్లాలనే కలను కలిగిన డాక్టర్ మంజుల తన పట్టుదలతో ఆ కలను సాకారం చేసుకున్నారు. గద్వాల్‌లో జన్మించిన మంజుల విద్యాభ్యాసం, ఉద్యోగ జీవితాన్ని మహబూబ్‌నగర్‌లో కొనసాగిస్తున్నారు. డాక్టర్ మంజుల చేపట్టిన యాత్రలో లేహ్ లోకల్ – మ్యాగ్నెటిక్ హిల్ – హాల్ ఆఫ్ ఫేమ్ – ఖర్దుంగ్ లా – నుబ్రా – తుర్తుక్ – థాంగ్ (భారత్‌లోని చివరి గ్రామం) – నుబ్రా – వారిలా – చాంగ్ లా – పాంగాంగ్ సరస్సు – లేహ్ వంటి అత్యంత క్లిష్టమైన ప్రాంతాలు ఉన్నాయి. ఎత్తైన పర్వత మార్గాలు, తీవ్రమైన చలి, కఠినమైన రహదారులు వంటి ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ.. ఆమె ఈ సాహస యాత్రను విజయవంతంగా పూర్తి చేశారు. అదేవిధంగా బంగీ జంప్ వంటి అత్యంత సాహసోపేతమైన విన్యాసాన్ని కూడా విజయవంతంగా పూర్తి చేసి తన ధైర్యసాహసాలను చాటుకున్నారు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ అధికారికంగా డాక్టర్ మంజుల సాధించిన ఈ ఘనతను ధృవీకరించింది. ఈ మార్గంలో బైక్‌పై ప్రయాణించిన తొలి మహిళగా ఆమెను గుర్తించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా డా. మంజుల మాట్లాడుతూ, “చిన్ననాటి నుంచి లేహ్-లడఖ్‌కు బైక్‌పై వెళ్లాలనే కల ఉండేది. భర్త, పిల్లలు, తల్లిదండ్రులు అందించిన ప్రోత్సాహం, సహకారం వల్లే ఈ కలను నిజం చేసుకోగలిగాను”అని తెలిపారు.

50 ఏళ్ల వయసులో బైక్‌పై లేహ్-లడఖ్ యాత్రతో పాటు బంగీ జంప్ వంటి సాహసాన్ని పూర్తి చేయడం ద్వారా వయసు కలలకు అడ్డంకి కాదని, ఆత్మవిశ్వాసం, పట్టుదల ఉంటే ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చని డాక్టర్ మంజుల నిరూపించారు. ఆమె సాధించిన ఈ ఘనతకు కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అభినందనలు తెలియజేస్తూ, మహిళా సాధికారతకు, పట్టుదలకు, సాహసానికి, కలలను సాకారం చేసుకునే తపనకు డాక్టర్ మంజుల ఒక గొప్ప స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us