
వీకెండ్ లో మీ భోజనాన్ని మరింత స్పెషల్గా మార్చే ఈ పప్పు ఉండల గ్రేవీ తయారీ విధానం చాలా సింపుల్. ఇంట్లో కూరగాయలు లేని టైమ్ లో దీన్ని ట్రై చేయొచ్చు. అయితే పప్పు ఉండల పులుసు తయారీలో ఉండలు విడిపోకుండా రావడం పులుసు చిక్కగా ఉండటం చాలా ముఖ్యం. ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం..
కావలసిన పదార్థాలు:
నల్ల శనగపప్పు: 200 గ్రాములు
ఎండు మిరపకాయలు: 7
సోంపు: 2 టీస్పూన్లు
ఉల్లిపాయలు: 2 (పెద్దవి)
టమోటాలు: 2
వెల్లుల్లి: 16 రెబ్బలు
తురిమిన కొబ్బరి: 1 కప్పు
చింతపండు: చిన్న నిమ్మకాయ సైజు
పొడులు: పసుపు, ధనియాల పొడి, కారం (తగినంత)
పోపు దినుసులు: ఆవాలు, మినపప్పు, మెంతులు, కరివేపాకు
నూనె, ఉప్పు, కొత్తిమీర: అవసరమైనంత
పప్పు ఉండల తయారీ:
ముందుగా శనగపప్పును 2 గంటల పాటు నానబెట్టి, నీరు లేకుండా వడకట్టాలి. మిక్సీ జార్లో ఎండు మిర్చి, సోంపు వేసి పొడి చేసిన తర్వాత, అందులో నానబెట్టిన పప్పు వేసి ముతకగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమంలో ఉప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయ, వెల్లుల్లి, కొబ్బరి తురుము, కరివేపాకు, కొత్తిమీర వేసి చిన్న చిన్న బంతుల్లా (ఉండల్లా) చేసి పక్కన పెట్టుకోవాలి.
పులుసు సిద్ధం చేసే విధానం:
ఒక పాత్రలో నూనె వేసి ఆవాలు, మినపప్పు, మెంతులు, కరివేపాకు వేసి వేయించాలి. అందులో ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించి, ఆపై టమోటా ముక్కలు వేసి మగ్గనివ్వాలి. ఇప్పుడు పసుపు, ధనియాల పొడి, ఉప్పు వేసి కలిపాక.. చింతపండు రసం, తగినన్ని నీళ్లు పోసి 6 నిమిషాల పాటు బాగా మరిగించాలి.
ఉండలు ఉడికించడం:
పులుసు బాగా మరుగుతున్నప్పుడు, మంటను మీడియంలో ఉంచి సిద్ధం చేసుకున్న పప్పు ఉండలను ఒక్కొక్కటిగా అందులో వేయాలి. వెంటనే గరిటెతో తిప్పకూడదు, అలా చేస్తే ఉండలు విడిపోతాయి. 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికిస్తే ఉండలు పైకి తేలడం ప్రారంభిస్తాయి. చివరగా కొబ్బరి-సోంపు పేస్ట్ వేసి మరో 3 నిమిషాలు మరిగించి, కొత్తిమీర చల్లుకుంటే రుచికరమైన పప్పు ఉండల పులుసు సిద్ధం.