
ఉదయం వేళ హడావిడిగా ఉన్నప్పుడు లేదా ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఈ చట్నీ ఒక బంపర్ ఐడియా. తక్కువ పదార్థాలతో ఈ చట్నీని చిటికెలో ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ నోరూరించే స్పెషల్ చట్నీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు:
నూనె – 1 టేబుల్ స్పూన్
వెల్లుల్లి – 8 రెబ్బలు
పచ్చి శనగపప్పు – 3 టేబుల్ స్పూన్లు
మినప్పప్పు – 2 టేబుల్ స్పూన్లు
వేరుశనగపప్పు – 2 టేబుల్ స్పూన్లు
ఎండు మిరపకాయలు – 5
కరివేపాకు – 1 కట్ట
చింతపండు – చిన్న ముక్క
ఉప్పు – రుచికి తగినంత
నీరు – అవసరమైనంత
తాలింపు కోసం:
నూనె – 2 టీస్పూన్లు
ఆవాలు – 1/2 టీస్పూన్
మినప్పప్పు – 1 టీస్పూన్
ఎండు మిర్చి – 1
కరివేపాకు – 1 కట్ట
తయారీ విధానం:
ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి, అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె పోయాలి.
నూనె వేడెక్కిన తర్వాత వెల్లుల్లి రెబ్బలను వేసి దోరగా వేయించి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి.
అదే పాన్ లో పచ్చి శనగపప్పు, మినప్పప్పు మరియు వేరుశనగపప్పు వేసి రంగు మారే వరకు బాగా వేయించాలి.
పప్పులు వేగిన తర్వాత ఎండు మిరపకాయలు, కరివేపాకు వేసి మరో నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి.
ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి తీసుకోవాలి.
అందులో చిన్న చింతపండు ముక్క, రుచికి సరిపడా ఉప్పు వేసి మొదట మెత్తగా రుబ్బుకోవాలి.
తర్వాత కొద్దిగా నీళ్లు పోసి మృదువైన పేస్ట్ లా చేసుకోవాలి.
ఈ చట్నీని ఒక గిన్నెలోకి తీసుకుని, మీకు కావలసినంత నీటిని కలిపి పలచని ‘నీళ్ల చట్నీ’ లాగా సిద్ధం చేసుకోవాలి.
తాలింపుతో ఫినిషింగ్:
చివరగా తాలింపు కోసం చిన్న పాన్ లో నూనె వేడి చేసి ఆవాలు, మినప్పప్పు, ఎండు మిర్చి కరివేపాకు వేసి వేయించాలి. ఈ తాలింపును చట్నీలో కలిపితే ఘుమఘుమలాడే ‘తన్నీ చట్నీ’ రెడీ! వేడివేడి ఇడ్లీలు లేదా కరకరలాడే దోశలతో ఈ చట్నీ తింటే రుచి అద్భుతంగా ఉంటుంది.