
పెరుగన్నం అనేది దక్షిణ భారతంలో ఒక ప్రసిద్ధ వంటకం, ముఖ్యంగా వేసవి కాలంలో ఇది శరీరానికి చలువ చేస్తుంది. సాధారణంగా దీని తయారీకి ఎక్కువ సమయం పట్టదు, కానీ 5 నిమిషాల్లో అద్భుతమైన రుచినిచ్చే పెరుగన్నాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ వంటకాన్ని రాత్రి మిగిలిన అన్నంతో కూడా చేసుకోవచ్చు, దీనికి కావలసినవి కేవలం కొన్ని సాధారణ పదార్థాలు.
ఉడికించిన అన్నం: 1 కప్పు, పెరుగు: అర లీటర్, సన్నగా తరిగిన ఉల్లిపాయ: 1, పచ్చిమిరపకాయలు: 2 (తరిగినవి), అల్లం తరుగు: 1 టీ స్పూన్, మిరియాలు: 1 టీ స్పూన్ (కచ్చాపచ్చాగా దంచుకోవాలి), పోపు దినుసులు: 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు: 2, నూనె: 1 టేబుల్ స్పూన్, ఉప్పు: తగినంత, కొత్తిమీర, కరివేపాకు: కొద్దిగా, ఇంగువ: చిటికెడు (తాలింపు కోసం), నీరు: పావు గ్లాసు
ముందుగా ఉడికించిన అన్నాన్ని ఒక గిన్నెలో తీసుకొని, గరిటతో మెత్తగా చేసుకోవాలి. అందులో తగినంత ఉప్పు, పెరుగు, పావు గ్లాసు నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. తర్వాత తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం తరుగు, కచ్చాపచ్చాగా దంచిన మిరియాలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం ఒక పాన్లో నూనె వేసి వేడయ్యాక పోపు దినుసులు, ఇంగువ వేసి వేయించుకోవాలి. పోపు దినుసులు వేగిన తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి ఫ్రై చేయాలి. ఈ వేడి తాలింపును ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగన్నంలో వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రుచికరమైన పెరుగన్నం సిద్ధం. ఏదైనా ఊరగాయతో తింటే ఈ పెరుగన్నం రుచి అద్భుతంగా ఉంటుంది.