
పనీర్ బిర్యానీ శాకాహారులకు చక్కటి రుచిని ఇచ్చే బెస్ట్ రెసిపీ. ఇది బాస్మతి రైస్, మసాలా పదార్థాలు, మెరినేట్ చేసిన పనీర్, కూరగాయలతో తయారు చేస్తారు. ఈ రెసిపీ ఆరోగ్యకరంగా ఉండటమే కాకుండా రుచికరంగా కూడా ఉంటుంది. నైట్ డిన్నర్ కి దీనిని తప్పకుండా ట్రై చేసి చూడండి.
ముందుగా పనీర్ ముక్కలను పెరుగు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉప్పు, కొద్దిగా గరం మసాలా కలిపి మెరినేట్ చేసి కొద్ది సేపు పక్కన పెట్టాలి. పాన్లో నెయ్యి వేసి అందులో ఉల్లిపాయ ముక్కలను వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. ఆ తర్వాత అల్లం-వెల్లుల్లి పేస్ట్, టమాటా పేస్టు వేసి బాగా కలిపి ఉడికించాలి. దానిలో మసాలాలు వేసి మరికొద్దిసేపు ఉంచాలి.
ఇప్పుడూ వేరుగా అన్నాన్ని ఉడికించాలి. అన్నం పూర్తిగా ఉడికిన తర్వాత పెద్ద గిన్నెలో బిర్యానీ లేయర్ లుగా వేసేందుకు సిద్ధం చేసుకోవాలి. బిర్యానీ తయారీ కోసం ఒక పెద్ద పాత్ర తీసుకుని మొదట కొంత అన్నం వేయాలి. తర్వాత పనీర్ మిక్స్ వేసి మళ్లీ అన్నం లేయర్ గా వేసి మసాలా పొడి, కొత్తిమీర, పుదీనాతో అలంకరించాలి.
గిన్నెపై మూత పెట్టి తక్కువ మంటపై 10 నిమిషాలు ఉంచాలి. వేడి వేడి రుచికరమైన పన్నీర్ బిర్యానీ రెడీ. చివరగా కొత్తిమీర, పుదీనా ఆకులతో అలంకరించి రైతాతో వడ్డించి తినండి. ఈ హెల్తీ పనీర్ బిర్యానీ చాలా రుచికరంగా ఉంటుంది.