
రోజూ తినే టిఫిన్లకు భిన్నంగా, ఆరోగ్యకరమైన, క్రిస్పీగా ఉండే టిఫిన్ ఏదైనా చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే శనగపప్పు దోసె సరైన ఎంపిక. ఇది కేవలం నోరూరించే రుచినే కాకుండా, శరీరానికి అవసరమైన పోషకాలను కూడా అందిస్తుంది. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి, ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవానుకునే వారికి ఇది సరైన బ్రేక్ఫాస్ట్.
శనగపప్పు: 1 కప్పు
బియ్యం: 1/2 కప్పు
పచ్చిమిర్చి: 2-3
అల్లం ముక్క: 1 అంగుళం
జీలకర్ర: 1 టీస్పూన్
ఇంగువ: చిటికెడు
ఉప్పు: రుచికి సరిపడా
నూనె లేదా నెయ్యి: దోసెలు కాల్చడానికి సరిపడా
కొత్తిమీర: సన్నగా తరిగినది మీ మోతాదుకు సరిపడా
ముందుగా శనగపప్పు, బియ్యాన్ని శుభ్రంగా కడిగి, సరిపడా నీరు పోసి కనీసం 3 నుండి 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. నానిన శనగపప్పు, బియ్యంలో ఉన్న నీటిని వడకట్టి, మిక్సీ జార్లో వేయాలి. అందులో పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు చేర్చి మెత్తటి పిండిలా రుబ్బుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీరు కలపవచ్చు. పిండి మరీ పల్చగా లేదా గట్టిగా ఉండకూడదు. రుబ్బిన పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని అందులో ఇంగువ, సన్నగా తరిగిన కొత్తిమీర కలిపి 10 నిమిషాలు పక్కన ఉంచాలి. దీనికి పులియబెట్టాల్సిన అవసరం లేదు.
పొయ్యిపై పెనం పెట్టి వేడెక్కిన తర్వాత, కొద్దిగా నీళ్లు చల్లి శుభ్రమైన గుడ్డతో తుడవాలి. ఇప్పుడు ఒక గరిటె పిండిని పెనం మధ్యలో వేసి వృత్తాకారంలో పల్చగా రుద్దాలి. దోశ చుట్టూ, మధ్యలో కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసి, మధ్యస్థ మంటపై దోసె బంగారు రంగు వచ్చి క్రిస్పీగా మారే వరకు కాల్చుకోవాలి. దోశను రెండో వైపు తిప్పాల్సిన అవసరం లేదు.
శనగపప్పులో ఐరన్, ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. తక్కువ క్యాలరీలు, ఎక్కువ పోషకాలు ఉండే ఈ క్రిస్పీ శనగపప్పు దోశను వేడివేడిగా కొబ్బరి చట్నీ లేదా కారప్పొడితో తింటే అద్భుతంగా ఉంటుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..