
రాత్రి పూట పండ్లు తింటే బరువు పెరుగుతారు.. ఇదే గత కొన్ని రోజులు సోషల్ మీడియాలో వినిపిస్తున్న మాటలు.. ఇది చాలా మందిని గందరగోళంలోకి నెట్టేసింది. రాత్రిపూట పండ్లు తినడం వల్ల వాటిలోని చక్కెర నేరుగా కొవ్వుగా మారుతుందని.. తద్వారా బరువు పెరుగుతారని ప్రచారం సాగింది. కానీ ఇందులో ఏమాత్రం నిజం లేదని వైద్యులు చెబుతున్నారు. బరువు పెరగడం అనేది మనం రోజంతా తీసుకునే మొత్తం కేలరీలు, తినే ఆహార పరిమాణంపై ఆదారపడి ఉంటుందని చెబుతున్నారు. దీనికి రాత్రి పండ్లు తినడానికి సంబంధం లేదని తెలిపారు.
రాత్రిపూట పండ్లు తింటే కొవ్వుగా మారుతుందా?
డాక్టర్ జెనిత్ సినోజియా ప్రకారం.. సాయంత్రం పండ్లు తినడం వల్ల అందులో ఉండే చక్కెర కొవ్వుగా మారుతుందనేది కేవలం ఆపోహ మాత్రమే. సాధారణంగా ఒక వ్యక్తి తనకు అవసరమైన దానికంటే ఎక్కువ కేలరీలను తీసుకుంటే లేదా అవసరానికి మించి తినడం వల్ల మాత్రమే బరువు పెరిగే అవకాశం ఉంది. పండ్లలో ఫైబర్తో సహా అనేక పోషకాలు ఉంటాయి. కాబట్టి, ఫ్రూట్ జ్యూస్, స్వీట్స్ లేదా షుగర్ యాడెడ్ కూల్ డ్రింక్స్ తాగే కంటే.. పండ్లు తినడమే ఉత్తమం అని ఆయన చెబుతున్నారు.
కానీ, కేవలం ఆరోగ్యానికి మంచిదని పండ్లను ఎక్కువగా తినడం కూడా మంచిది కాదని చెబుతున్నారు. మీరు తినే ఆహారం పరిమాణం కూడా మీ బరువు పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఉదాహరణకు, మీరు రాత్రి భోజనంలో ఎక్కువగా తిని, ఆ తర్వాత స్నాక్గా ఎక్కువ మొత్తంలో పండ్లు తింటే, ఆ రోజు మీ మొత్తం కేలరీల వినియోగం పెరగవచ్చు, ఇది దీర్ఘకాలంలో బరువు పెరగడానికి దారితీయవచ్చు. కాబట్టి మీకు డైలీ ఎంత క్యాలరీస్ కావాలో తెలుసుకొని తినడం మంచిది.
ఒక వేళ మీరు డయాబెటీస్ వంటి వ్యాధులతో బాధపడుతుంటే పండ్లు తినే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు రోజుకు ఎన్ని పండ్లు తినాలి, వాటిని ఎలా తీసుకోవాలి అనే విషయాల గురించి వైద్యుడిని లేదా పోషకాహార నిపుణుడిని అడిగి తెలుసుకోవడం ముఖ్యం.
మరిన్ని లైఫ్స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.