
వర్షాకాలం ప్రారంభమై వాతావరణం కాస్త చల్లబడగానే చాలామంది ఇళ్లలో ఫ్రిజ్ వాటర్ లేదా చల్లటి నీరు తాగడం పూర్తిగా ఆపేస్తుంటారు. చల్లటి నీళ్లు తాగితే వెంటనే జలుబు, గొంతునొప్పి వస్తాయని, ముఖ్యంగా పిల్లలు దీని బారిన పడతారని చాలామంది గట్టిగా నమ్ముతారు. అయితే వైద్య శాస్త్రం ప్రకారం చల్లటి నీరు తాగడం వల్ల నిజంగానే జలుబు వస్తుందా? దీని వెనుక ఉన్న శాస్త్రీయ వాస్తవాలేమిటి? అనే విషయాలు చాలా మందికి తెలియవు. వైద్య నిపుణుల ప్రకారం.. సాధారణ జలుబు అనేది నీటి ఉష్ణోగ్రత వల్ల వచ్చేది కాదు, అదొక తీవ్రమైన వైరల్ ఇన్ఫెక్షన్. ఇది ముక్కు, గొంతు, పై శ్వాసకోశ మార్గం లోపలి పొరలపై దాడి చేస్తుంది. సుమారు 200 కంటే ఎక్కువ రకాల వైరస్లు జలుబుకు కారణమవుతాయి. వాటిలో రైనోవైరస్ అత్యంత సాధారణమైనది. ఈ వైరస్లు శరీరంలోకి ప్రవేశించినప్పుడే ముక్కు కారడం, తుమ్ములు, గొంతు గరగర వంటి లక్షణాలు కనిపిస్తాయి.
చల్లటి నీరు తాగడం వల్ల నేరుగా జలుబు రాదనే విషయాన్ని యథార్థ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇంటర్నల్ మెడిసిన్ అండ్ డయాబెటిస్ సీనియర్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ గోంబర్ స్పష్టం చేశారు. సాధారణ జలుబు అనేది పూర్తిగా వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల మాత్రమే వస్తుంది తప్ప, నీటి చల్లదనంతో సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు. పూర్తి ఆరోగ్యంతో ఉన్న ఏ వ్యక్తి అయినా సాధారణ పరిస్థితుల్లో తనకు అనుకూలమైన ఉష్ణోగ్రతలో నీటిని నిరభ్యంతరంగా తాగవచ్చని ఆయన తెలిపారు.
చల్లటి నీరు వైరస్లను సృష్టించకపోయినప్పటికీ, కొన్ని నిర్దిష్ట పరిస్థితులలో ఇది గొంతు అసౌకర్యానికి కారణం కావచ్చు. ముఖ్యంగా ఇప్పటికే గొంతు ఇన్ఫెక్షన్, టాన్సిల్స్ లేదా రెస్పిరేటరీ అలర్జీలు ఉన్నవారు అతి చల్లటి నీరు తాగితే గొంతులో సున్నితత్వం పెరిగి నొప్పి లేదా గరగర ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఇది కేవలం తాత్కాలిక అసౌకర్యం మాత్రమే తప్ప, చల్లటి నీరు నేరుగా జలుబును వ్యాపింపజేయదు.
చేతుల పరిశుభ్రత: వైరస్లు ఎక్కువగా చేతుల ద్వారానే వ్యాపిస్తాయి కాబట్టి, చేతులను సబ్బుతో తరచూ శుభ్రంగా కడుక్కోవాలి.
దూరం పాటించడం: ఇప్పటికే జలుబు, దగ్గుతో బాధపడుతున్న వ్యక్తులకు దూరంగా ఉండటం మంచిది.
రోగనిరోధక శక్తి: రోజూ తగినంత నిద్రపోవడం, తాజా పండ్లు, కూరగాయలతో కూడిన సమతుల్య పోషకాహారం తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి.
ఒకవేళ జలుబుతో పాటు తీవ్రమైన జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఎడతెగని దగ్గు వంటి లక్షణాలు కనిపించినా, లేదా సమస్య ఎక్కువ రోజులు కొనసాగినా ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే అర్హులైన వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.