
ఆరోగ్యంగా ఉండటానికి రోజూ తగినంత నీరు తాగడం చాలా అవసరమని మనందరికీ తెలుసు. అయితే, చాలామంది కేవలం నీటి పరిమాణం పైనే దృష్టి పెడతారు కానీ, దానిని ఏ సమయంలో తాగుతున్నామనే విషయాన్ని విస్మరిస్తుంటారు. ఆయుర్వేద నిపుణురాలు డింపుల్ జంగ్దా ప్రకారం, నీరు తాగే టైమింగ్ మన జీర్ణవ్యవస్థపై, మొత్తం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. నీటిని సరైన పద్ధతిలో, సరైన సమయంలో ఎలా తీసుకోవాలో ఆమె వివరించిన ఆశ్చర్యకరమైన చిట్కాలు ఇక్కడ చూద్దాం.
ఉదయాన్నే గోరువెచ్చని నీరు: ఉదయం నిద్ర లేవగానే సుమారు 200 మిల్లీలీటర్ల గోరువెచ్చని నీటిని తాగాలి. ఉదయాన్నే చల్లని నీరు తాగడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. మెటబాలిజం పెరగడానికి ఈ వెచ్చని నీటిలో కొద్దిగా అల్లం, సైంధవ లవణం, చిటికెడు దాల్చినచెక్క పొడి కలిపి తీసుకోవచ్చు.
స్నానానికి ముందు ఒక గ్లాసు నీరు: స్నానం చేయడానికి వెళ్లే ముందు ఒక గ్లాసు నీరు తాగడం మంచి అలవాటు. ఇది శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా స్నానం చేసేటప్పుడు అకస్మాత్తుగా వచ్చే కళ్ళు తిరగడం లేదా స్పృహ తప్పడం వంటి సమస్యలను నివారిస్తుంది.
భోజన సమయంలో నీటిని నివారించండి: చాలామంది తింటూ నీళ్లు తాగుతుంటారు. కానీ నిపుణుల ప్రకారం, భోజనం చేయడానికి 30 నిమిషాల ముందు ఒక గ్లాసు నీరు తాగాలి. మళ్ళీ భోజనం ముగిసిన గంట తర్వాతే నీరు తాగాలి. భోజనం మధ్యలో ఎక్కువగా నీరు తాగడం వల్ల జీర్ణ ఎంజైమ్లు పలచబడిపోయి, ఆహారం సరిగ్గా అరగక కడుపు ఉబ్బరం వస్తుంది.
ఇకపోతే, ఒకేసారి లీటర్ల కొద్దీ నీటిని గుటగుట తాగేయడం కంటే, రోజంతా కొద్దికొద్దిగా సిప్ చేస్తూ తాగడం ఉత్తమం. మధ్యాహ్నం 4 గంటల లోపు సుమారు 1.5 లీటర్ల నీటిని తాగడం పూర్తి చేయాలి. ఆ తర్వాత సూర్యాస్తమయం లోపు మరో అర లీటరు తాగాలి. సూర్యాస్తమయం దాటిన తర్వాత కేవలం దాహం వేసినప్పుడు మాత్రమే కొద్దికొద్దిగా నీరు తీసుకోవాలి. రాత్రి పడుకునే ముందు కేవలం అర గ్లాసు నీరు మాత్రమే తాగాలి. దీనివల్ల రాత్రి పూట పదే పదే మూత్ర విసర్జనకు లేవాల్సిన అవసరం లేకుండా నిద్ర ప్రశాంతంగా ఉంటుంది.