కేంద్ర వ్యవసాయ బిల్లులతో రైతుల‌కు తీర‌ని న‌ష్టంః హరీష్ రావు

|

Oct 28, 2020 | 4:19 PM

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులు రైతుల‌కు తీర‌ని న‌ష్టం క‌లుగుతుంద‌ని, దీన్ని టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుందని రాష్ట్ర మంత్రి హరీష్ రావు తెలిపారు.

కేంద్ర వ్యవసాయ బిల్లులతో రైతుల‌కు తీర‌ని న‌ష్టంః హరీష్ రావు
Follow us on

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులు రైతుల‌కు తీర‌ని న‌ష్టం క‌లుగుతుంద‌ని, దీన్ని టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుందని రాష్ట్ర మంత్రి హరీష్ రావు తెలిపారు. త్వ‌ర‌లోనే బిల్లులను నిరసిస్తూ రాష్ర్ట వ్యాప్తంగా టీఆర్ఎస్ ఉద్య‌మం చేస్తుంద‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు. దుబ్బాక ఉప ఎన్నిక నేప‌థ్యంలో చేగుంట‌లో టీఆర్ఎస్ పార్టీకి మ‌ద్ద‌తుగా రైతులు నిర్వహించిన ర్యాలీలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. నియోజకవర్గం నుంచి భారీగా తరలివచ్చిన రైత‌న్న‌ల‌తో చేగుంట నిండిపోయింది. టీఆర్ఎస్‌కే త‌మ మ‌ద్ద‌తు, ఓటు అంటూ రైతులు నిన‌దించారు.

ఈ ఏడాది ఏప్రిల్ 27న అగ్రికల్చ‌ర్ బిల్లుల‌ను మోదీ సర్కార్ ప్రవేశపెట్టింది. స‌బ్సిడీ లేకుండా బిల్లు ఇవ్వాల‌ని మే 17న కేంద్రం రాష్ట్రాలకు లేఖ రాసింది. బావుల వ‌ద్ద మీట‌ర్లు పెడితే రూ. 2,500 కోట్లు ఇస్తామ‌న్నారు. బావుల ద‌గ్గ‌ర మీట‌ర్లు పెట్టే ప్ర‌స‌క్తే లేద‌ని జూన్ 2న కేంద్రానికి సీఎం కేసీఆర్ లేఖ రాశార‌ని హ‌రీష్ రావు గుర్తు చేశారు. రైతుల‌ను మోసం చేస్తున్న బీజేపీని 300 మీట‌ర్ల లోతులో పాతిపెట్టాల‌ని సూచించారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వ హయాంలో ఎప్పడు కరెంట్ సరిగా ఉండటపోవటంతో పంట‌లు ఎండిపోయేవి. ముత్యం రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న‌ప్పుడు రూ. 30 వేలు ఇస్తేనే ట్రాన్స్‌ఫార్మ‌ర్లు ఇచ్చేవార‌ని గుర్తు చేశారు.

విదేశీ మ‌క్క‌ల‌ను దిగుమ‌తి చేసుకుని రైతుల పొట్టకొడుతున్న బీజేపీ సర్కార్.. ఎవ‌రీ ప్ర‌యోజ‌నాల కోసం ప‌ని చేస్తుంద‌ని మంత్రి హ‌రీష్ రావు ధ్వ‌జ‌మెత్తారు. కాలిపోయే మోటార్లు కావాలా? ‌బావుల వ‌ద్ద మీట‌ర్లు కావాలా? నాణ్య‌మైన 24 గంట‌ల ఉచిత విద్యుత్ కావాలో నిర్ణ‌యించుకోవాల్సిందే రైతులే అని మంత్రి హ‌రీష్ రావు అన్నారు. రైతుల సంక్షేమానికే కంకణం కట్టుకున్న కేసీఆర్ వెంటే రాష్ట్రంలోని రైతులు ఉన్నారని మంత్రి హరీష్ రావు గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు డిపాజిట్ కూడా రానివ్వద్దని ఆయన పిలుపునిచ్చారు.