తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి ఇక కష్టకాలమేనా..? పార్టీకి తిరిగి పూర్వ వైభవం తేవడం పెద్ద సవాలే

|

Dec 18, 2020 | 11:06 AM

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మున్ముందు కష్టకాలమే అన్నట్లు ఉంది. రాష్ట్రంలో పూర్తిగా నామరూపాలు లేకుండా పోతున్న తరుణంలో పార్టీకి పూర్వ వైభవం తేవడం నేతలకు పెద్ద సవాల్ గా మారింది...

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి ఇక కష్టకాలమేనా..? పార్టీకి తిరిగి పూర్వ వైభవం తేవడం పెద్ద సవాలే
Follow us on

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మున్ముందు కష్టకాలమే అన్నట్లు ఉంది. రాష్ట్రంలో పూర్తిగా నామరూపాలు లేకుండా పోతున్న తరుణంలో పార్టీకి పూర్వ వైభవం తేవడం నేతలకు పెద్ద సవాల్ గా మారింది. ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి జీహెచ్ ఎంసీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో మరొకరిని నియమించాల్సిన అవసరం ఉంది. జీహెచ్ ఎంసీ ఎన్నికల ఫలితాలపై తాను బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు ఉత్తమ్. ఇక అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో రకరకాల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధ్యక్ష పదవి కోసం సీనియర్ నేతలు సైతం ఢిల్లీ బాట పడుతున్నారు. పదవిని దక్కించుకునేందుకు ఎవరికి వారు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. సీనియర్ నేతల పేర్లు వినబడుతున్నప్పటికీ ఎవరు పీసీసీ పగ్గాలు చేపట్టినా వారికి ముందు ముందు సవాల్ అని చెప్పక తప్పదు.

కాంగ్రెస్ పార్టీ గత ఆరేళ్ల కాలంలో క్యాడర్‌తో పాటు లీడర్లను సైతం కోల్పోయింది. ఆరేళ్ల నుంచి అధికారంలోకి రాకపోవడంతో అనేక మంది పార్టీని వీడి వెళ్లిపోయారు. క్యాడర్‌ అనేక చోట్ల సైలెంట్‌గానే ఉండిపోయింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీకి ఎవరు ముందుకు రాకపోవడం ఇందుకు నిదర్శనంగా మారింది. ఏ జిల్లాల్లోనైనా కాంగ్రెస్‌కు సరైన నాయకత్వం లేదు. పార్టీని ముందుండి నడిపించే నాయకుడు లేక మరుగునపడిపోతోంది.

ఆర్థికంగా ఇబ్బందులు..
కాగా, ఆరేళ్ల నుంచి అధికారంలో లేకపోవడంతో పార్టీ నేతలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఏవైనా కార్యక్రమాలు చేపట్టేందుకు ముందుకు రాని పరిస్థితి నెలకొంది. దీనికి తోడు జిల్లాల్లో ఉన్న నేతల మధ్య ఉన్న విబేధాలు కూడా పార్టీని బాగా కుంగదీస్తున్నాయి. పార్టీలో ఒకరినొకరు ఫిర్యాదు చేసుకోవడం, ఆరోపణలు చేసుకోవడానికే నేతలు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు.

దీంతో పార్టీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. కొత్త పీసీసీ అధ్యక్షుడు ఎవరైనా ముందుగా సమన్వం చేసుకోవాల్సిన ఉంటుంది. కానీ తెలంగాణలో మాత్రం సాధ్యమయ్యే పని కాదన్నట్లు కనిపిస్తోంది. హైకమాండ్‌ ఆశీస్సులున్న ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వల్లే కాలేదు.. ఇతర నేతలతో ఏమవుతుందనే వాదన వినిపిస్తోంది. పీసీసీ పగ్గాలు చేపట్టే నేతలెవరైనా సరే పార్టీ నేతల సమన్వయంతో చేసుకుంటూ కష్టపడుతూ ముందుకు సాగితే పార్టీ ఏమైనా కాస్త గట్టెక్కే పరిస్థితి ఉంటుంది. లేకపోతే కొత్తగా వచ్చే ప్రయోజనం ఏముండదు.

సొంత‌గూటిలోనే బేధాలు
ఇక రాష్ట్రంలో పీసీసీ ప‌ద‌విని క‌ట్ట‌బెట్టే విష‌యంలో నేత‌ల‌కు సొంత గూటిలోనే విధాలు ఏర్ప‌డుతున్నాయి. నేను సీనియ‌ర్ అంటే.. నేను సీనియ‌ర్ అంటూ పైర‌వీలు కొన‌సాగిస్తున్నారు. పీసీసీ కోసం ఒక‌రిపై ఒక‌రు ఫిర్యాదు చేసుకోవ‌డం విధాలు త‌లెత్తుతున్నాయి. సీనియ‌ర్ల‌ను కాకుండా ఇతరుల‌కు పీసీసీ క‌ట్ట‌బెడితే ఊరుకోమంటూ చెప్పుకొస్తున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని బ‌లోపేతం చేయ‌డం త‌మ‌తోనే సాధ్య‌మంటూ ఎవ‌రికి వారు డ‌ప్పుకొట్టుకుంటున్నారు. గ‌త కొన్ని నెల‌ల నుంచి పీసీసీ ప‌ద‌వి గురించి ర‌ద్దాంతం జ‌రుగుతున్నా.. ఢిల్లీ పెద్ద‌లు నోరు మెద‌ప‌డం లేదు.

తాము అంద‌రితోనే సంప్ర‌దింపులు జ‌రిపిన త‌ర్వాతే పార్టీని బ‌లోపేతం చేసే స‌త్తా ఉన్న‌వారికే అధ్య‌క్ష ప‌ద‌విని క‌ట్ట‌బెడ‌తామంటూ ఢిల్లీ కాంగ్రెస్ పెద్ద‌లు చెబుతున్న‌మాట‌. ముందే మ‌రుగున ప‌డిపోతున్న పార్టీని గ‌ట్టెక్కించాలంటూ ప‌దునైనా క‌త్తిలాంటి నేత‌కు పీసీసీ ప‌గ్గాలు అప్ప‌గించ‌డ‌మే మేలంటున్నారు విశ్లేష‌కులు.